చాణక్య నీతి: మీరు సుఖవంతమైన జీవితం కోరుకుంటే ఈ 4 విషయాలు తప్పక ఆచరించండి.. ఇవి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనవి
ABN , First Publish Date - 2021-11-28T11:42:31+05:30 IST
ఆచార్య చాణక్య గొప్ప ఆర్థికవేత్త, తెలివైన వ్యూహకర్త..
ఆచార్య చాణక్య గొప్ప ఆర్థికవేత్త, తెలివైన వ్యూహకర్త, ఆయన రూపొందించిన విధానాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. చాణక్య నీతిలో తెలిపిన వివరాల ప్రకారం.. ఎవరైనా సంతోషకరమైన జీవితాన్ని గడపాలంటే జీవితంలో కొన్ని సూత్రాలను పాటించడంతోపాటు, క్రమశిక్షణ కలిగి ఉండటం చాలా ముఖ్యం. కౌటిల్యునిగా ప్రసిద్ధి చెందిన ఆచార్య చాణక్యుడు.. చంద్ర గుప్త మౌర్య.. మగధ చక్రవర్తి కావడంలో కీలక పాత్ర పోషించాడు. ఎవరైనా తమ జీవితంలో చాణక్య విధానాలను అమలుచేస్తే వారి జీవితం సంతోషంగా, ప్రశాంతంగా గడిచిపోతుందని నమ్ముతారు. ఆచార్య చాణక్య తన నీతిశాస్త్రంలో 4 విషయాలకు అత్యున్నత స్థానాన్ని కల్పించారు. అవి ఈ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనవి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
తల్లికి అత్యున్నత స్థానం
ఆచార్య చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం గురువు, దేవతల కంటే తల్లికి ఈ ప్రపంచం మొత్తంలో అత్యున్నత స్థానం ఉంది. అందుకే తల్లిని ఎల్లప్పుడూ గౌరవించాలి. తన తల్లికి గౌరవం ఇచ్చే వ్యక్తికి అతను తన జీవితంలో కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి.
అన్నదానం
ఆచార్య చాణక్య అన్నదానం చేయడం అత్యంత పుణ్యకార్యమని తెలిపారు. ఆహారం, త్రాగునీరు దానం చేయడం ద్వారా, భగవంతుని ఆశీర్వాదాలను లభిస్తాయి. అందుకే నిత్యం దాన ధర్మాలు చేయాలని ఆచార్య చాణక్య తెలిపారు.
గాయత్రీ మంత్రం
ఈ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనది గాయత్రీ మంత్రం అని ఆచార్య చాణక్య తెలిపారు. ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా వ్యక్తి తన జీవితంలో బలం, దీర్ఘాయువు, అపారమైన సంపదను పొందుతాడని చాణక్య పేర్కొన్నారు.
ఏకాదశి తిథి
ఆచార్య చాణక్య.. ఏకాదశి తిథిని అత్యంత పవిత్రమైనదిగా అభివర్ణించారు. ఆ రోజున శ్రీమహావిష్ణువును పూజించడం వల్ల మనిషికి బాధలు తొలగిపోతాయని తెలిపారు. ఏడాదికి దాదాపు 24 ఏకాదశులు వస్తాయి. వీటన్నింటిలో కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి అత్యంత ముఖ్యమైనదని పురాణాలు చెబుతున్నాయి.