నాడు-నేడు పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు
ABN , First Publish Date - 2021-07-25T05:48:51+05:30 IST
నాడు-నేడు పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని జాయింట్ కలెక్టర్ పి. అరుణ్బాబు అన్నారు. శనివారం ముంచంగిపుట్టు, పెదబయలు మండలలాల్లో జేసీ సుడిగాలి పర్యటన చేశారు.
జాయింట్ కలెక్టర్ అరుణ్బాబు
ముంచంగిపుట్టు, జూలై 24: నాడు-నేడు పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని జాయింట్ కలెక్టర్ పి. అరుణ్బాబు అన్నారు. శనివారం ముంచంగిపుట్టు, పెదబయలు మండలలాల్లో జేసీ సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా నాడు-నేడు పనులను పరిశీలించారు. తొలుత బంగారుమెట్ట గ్రామాన్ని సందర్శించి, అక్కడ ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే సచివాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని సిబ్బందికి సూచించారు. అనంతరం చోటాముక్కిపుట్టు మండల పరిషత్ పాఠశాలలో జరుగుతున్న నాడు-నేడు పనులను పరిశీలించారు. పనులను బాగా చేశారని ఆ పాఠశాల ఉపాధ్యాయులను అరుణ్బాబు అభినందించారు. అనంతరం స్థానిక గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాల(1)లో జరుగుతున్న నాడు-నేడు పనులను పరిశీలించారు. అక్కడ పనులు ఆశించిన స్థాయిలో జరగకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు వేగవంతంగా పూర్తిచేయాలని ఆదేశించారు. అలాగే ఇంజనీరింగ్ అధికారులు తరచూ నాడు-నేడు పనులను పర్యవేక్షించాలని, సకాలంలో పనులు పూర్తయ్యేవిధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఏ పీవో డి.మల్లికార్జున్రెడ్డి, ట్రైబుల్ వెల్ఫేర్ ఈఈ శ్రీనివాస్, డీఈ సింహాచలం, ఏఈ శ్రీకాంత్, ఎంపీడీవో ఏవీవీ కుమార్, సీఆర్పీలు అనిల్, సురేష్, ఈశ్వర్, గౌరి పాల్గొన్నారు.