మా గ్రామంలో స్టోన్ క్రషర్ వద్దు
ABN , First Publish Date - 2022-08-17T04:52:59+05:30 IST
మండలంలోని ఊట్ల గ్రామంలో నూతన స్టోన్ క్రషర్ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ నిలిపి వేయాలని ప్రజాప్రతినిధులు, నాయకులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
కలెక్టరేట్ వద్ద ఊట్ల గ్రామస్థుల ధర్నా.. కలెక్టర్కు ఫిర్యాదు
జిన్నారం, ఆగస్టు 16: మండలంలోని ఊట్ల గ్రామంలో నూతన స్టోన్ క్రషర్ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ నిలిపి వేయాలని ప్రజాప్రతినిధులు, నాయకులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ శరత్కు ఫిర్యాదు చేశారు. మంగళవారం ఎంపీపీ ఉపాధ్యక్షుడు గంగు రమేష్, సర్పంచ్ ఆంజనేయులు, ఉప సర్పంచ్ రవి, మాజీ సర్పంచ్ జింకల శివరాజ్ ఆధ్వర్యంలో గ్రామస్థులు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తరలివెళ్లి ధర్నా నిర్వహించారు. గ్రామ శివారులో కొత్తగా స్టోన్ క్రషర్ ఏర్పాటు కోసం ఈనెల 27న తలపెట్టిన ప్రజాభిప్రాయ సేకరణను వ్యతిరేకిస్తున్నట్లు వారు స్పష్టం చేశారు. ప్రజాభిప్రాయ సేకరణ అవసరం లేదని, వెంటనే రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి, కలెక్టర్ శరత్కు ఫిర్యాదు చేశారు. అంతకుముందు జిన్నారంలో తహసీల్దార్ దశరథకు వినతి పత్రం అందజేశారు.