ఈ నెలా కోటా లేనట్టే..!

ABN , First Publish Date - 2022-05-21T04:47:21+05:30 IST

ఉచిత బియ్యం ఈ నెల కూడా అందడం కష్టమేనని తెలుస్తోంది. ఇంకా రేషన షాపులకు బియ్యం చేరలేదని తెలుస్తోంది.

ఈ నెలా కోటా  లేనట్టే..!

కర్నూలు(కలెక్టరేట్‌) మే 20: ఉచిత బియ్యం ఈ నెల కూడా అందడం కష్టమేనని తెలుస్తోంది. ఇంకా రేషన షాపులకు బియ్యం చేరలేదని తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో పేదల కడుపు నింపేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్నయోజన పేరిట ఉచిత బియ్యం పంపిణీని ప్రారంభించింది. రేషనకార్డుదారులకు ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున ఉచితంగా అందిస్తోంది. ఇందు కోసం రాషా్ట్రలకు ధాన్యం లేదా నగదు ఇస్తోంది. అయితే ఇక్కడ మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే బియ్యం పంపిణీ చేస్తుండగా కేంద్రం నగదు ఇస్తోంది. కాగా ఉచిత కోటా మార్చితో ముగియాల్సి ఉండగా కేంద్రం మరోసారి ఐదు నెలలు పొడిగించింది. దీంతో ఆయా నెలల్లో రెగ్యులర్‌ రేషన కోటా పంపిణీ ముగిశాక.. 17వ తేదీ నుంచి ఉచిత బియ్యం ఇచ్చే వారు. అయితే ఏప్రిల్‌ నెల ఉచిత బియ్యం పంపిణీ చేయలేదు. రెండు నెలల బియ్యం కలిపి మే నెలలో ఇస్తామని గత నెలలో అధికారులు ప్రకటించారు. ఇప్పుడు మే నెల 19వ తేదీకి కూడా రేషన షాపులకు ఉచిత కోటా బియ్యం సరఫరా కాలేదు. అసలు ఇస్తారా? లేదా? అనే సమాచారమూ లేదు. ఇప్పటికీ పంపిణీ ప్రక్రియే మొదలు కాలేదంటే.. వరుసగా రెండో నెలలోనూ పేదలకు ఉచిత బియ్యం లేనట్టేనని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఉమ్మడి జిల్లాలో 11,88,000 రేషనకార్డుదారులకు రెండు నెలలుగా బియ్యం అందని పరిస్థితి నెలకొంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2,345 రేషన షాపుల పరిధిలో 11,88,000 రేషన కార్డులు, 44 లక్షల మంది కుటుంబ సభ్యులు ఉన్నారు. ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున 22 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం కావాలి. రెండు నెలల కోటా మే నెలలో ఇస్తారని ఇన్నాళ్లు ఎదురు చూసిన కార్డుదారులు రాష్ట్ర ప్రభుత్వ తీరుతో నిరాశకు గురయ్యారు.

Updated Date - 2022-05-21T04:47:21+05:30 IST