వ్యవసాయానికి ‘లాక్’ లేదు
ABN , First Publish Date - 2020-04-08T12:07:54+05:30 IST
ప్రస్తుతం కరోనా వైరస్ నిరోధానికి అమలు చేస్తున్న లాక్డౌన్ సమయంలో వ్యవసాయ పనుల నిర్వహణకు ఎటువంటి అభ్యంతరం
రైతులు పనులు చేసుకోవచ్చు
వ్యవసాయ శాఖ జేడీ శ్రీధర్
గుజరాతీపేట, ఏప్రిల్ 7: ప్రస్తుతం కరోనా వైరస్ నిరోధానికి అమలు చేస్తున్న లాక్డౌన్ సమయంలో వ్యవసాయ పనుల నిర్వహణకు ఎటువంటి అభ్యంతరం లేదని జిల్లా వ్యవసాయశాఖ జేడీ శ్రీధర్ తెలిపారు. రైతులు భౌతిక దూరం పాటించి.. యథావిధిగా వ్యవసాయ పనులు చేసుకోవచ్చని.. దీనిపై ప్రభుత్వం విధి విధానాలను జారీ చేసిందని వెల్లడించారు. మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’తో ఆయన మాట్లాడుతూ.. ‘రైతులు వ్యవసాయ క్షేత్రాల్లోకి వెళ్లి మధ్యాహ్నం 2 గంటల వరకు పనులను నిర్వహించుకోవచ్చు. ప్రస్తుతం జిల్లాలో వరి, మొక్కజొన్న, నువ్వు పంటల కోతలు జరుగుతున్నాయి. మొక్కజొన్న పంట కోతలు 50 శాతం, వరి కోతలు 20 శాతం వరకు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో వరి, మొక్కజొన్న పంట ఉత్పత్తుల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. జిల్లాలో రైతులు ప్రస్తుత రబీ సీజన్లో 18,800 హెక్టార్లలో మొక్కజొన్న సాగు చేశారు.
94వేల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నాం. ఈ మేరకు మంగళవారం జిల్లాలో 15 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాం. రాజాం, రేగిడి, సంతకవిటి, పొందూరు, జి.సిగడాం, లావేరు, రణస్థలం (పైడిభీమవరం), ఎచ్చెర్ల (ఎస్.ఎస్.ఆర్.పురం), అరసవల్లి, ఎల్.ఎన్.పేట, పాతపట్నం, కొత్తూరు, జలుమూరు (చల్లవానిపేట), నరసన్నపేటలలో ఈ కేంద్రాలను ఏర్పాటు చేశాం. ప్రభుత్వం క్వింటాల్కు రూ.1,760 మద్దతు ధర ప్రకటించింది. ఏపీ మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో జూన్ 16 వరకు కొనుగోల చేస్తాం. దళారులు జోక్యం చేసుకుంటే కఠిన చర్యలు తప్పవని ఇప్పటికే జేసీ శ్రీనివాసులు హెచ్చరికలు జారీచేశారు.
జిల్లాలో ఈ ఏడాది 7,800 హెక్టార్లలో రైతులు వరి సాగు చేశారు. 42వేల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నాం. 20వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లకు లక్ష్యం విధించాం. బుధవారం నుంచి జిల్లాలో 60 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తాం. వరిపంట, మొక్కజొన్న విక్రయించే రైతులు బ్యాంక్ అకౌంట్, పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్లను కల్గి ఉండాలి’ అని సూచించారు.