నిధులున్నా అభివృద్ధి శూన్యం
ABN , First Publish Date - 2022-08-05T05:43:59+05:30 IST
దేశ్ముఖి-పిలాయిపల్లి రోడ్డుతోపాటు బాటసింగారం-దేశ్ముఖి రోడ్డు పూర్తిగా గుంతలమయమై బురదగా మారింది. రోడ్డుకు నిధులు మంజూరైనా మరమ్మతులకు మాత్రం మోక్షం కలగడంలేదు.
కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో నిలిచిన రోడ్డు పనులు
కొత్తగూడెం-దేశ్ముఖి రోడ్డు గంతలతో బురదమయం
ఇబ్బందులు పడుతున్న వాహనదారులు
భూదాన్పోచంపల్లి, ఆగస్టు 4: దేశ్ముఖి-పిలాయిపల్లి రోడ్డుతోపాటు బాటసింగారం-దేశ్ముఖి రోడ్డు పూర్తిగా గుంతలమయమై బురదగా మారింది. రోడ్డుకు నిధులు మంజూరైనా మరమ్మతులకు మాత్రం మోక్షం కలగడంలేదు. దీంతో నిత్యం గతుకులు, బురద రోడ్డులో ప్రయాణించలేక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం రెండేళ్ల క్రితం దేశ్ముఖి-పిలాయిపల్లి వరకు 4కి.మీ డబుల్ రోడ్డు నిర్మాణానికి రూ.6కోట్లు మంజూరు చేసింది.
మట్టిపోసి వదిలేసిన కాంట్రాక్టర్
రోడ్డు పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్ ఏడాదిన్నర క్రితం కొన్ని కల్వర్టులు నిర్మించి, కంకర, మట్టిపరిచి పనులను మధ్యలో వదిలేశాడు. దీంతో అధికారులు పలుమార్లు కాంట్రాక్టర్కు నోటీసులు జారీ చేసినా నిర్లక్ష్యం వహించడంతో రోడ్డుకు మోక్షం కలగడం లేదు. పిలాయిపల్లి, దేశ్ముఖి గ్రామాల పరిధిలో 15 స్టోన్ క్రషర్లు, రెండు ఇంజనీరింగ్ కళాశాలలు, సాయిబృందావన క్షేత్రం ఉంది. దీంతో ఈ మార్గం మీదుగా విద్యార్థులు, భక్తుల వాహనాలు, టిప్పర్లతో నిత్యం రద్దీగా ఉంటోంది. టిప్పర్లు రాత్రింబవళ్లు నడుస్తుండటంతో ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డుపై గుంతలు ఏర్పడి వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. గుంతల కారణంగా గ్రామానికి వచ్చే ఆర్టీసీ బస్సు సైతం రద్దయింది. బురద, దుమ్ముతో ద్విచక్రవాహనదారులు తరుచూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే కాంట్రాక్టర్పై చర్య తీసుకొని రోడ్డుకు మోక్షం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.
వెంటనే రోడ్డు పనులు చేపట్టాలి : నూకల అశోక్, దేశ్ముఖి
రోడ్డుకు మరమ్మతులు చేయాలని మూడేళ్లుగా పోరాడుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. రోడ్డును తవ్వి మట్టిపోసి మధ్యలోనే వదిలేశారు. దీంతో దుమ్ముతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇటీవల కురిసిన వర్షానికి రోడ్డు మరింత అధ్వానంగా మారింది. వెంటనే రోడ్డు పనులు చేపట్టాలి.
కాంట్రాక్టర్కు నోటీసులు జారీ చేశాం : విజయ్, ఆర్అండ్బీ ఏఈ
కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే రోడ్డు పనుల్లో జాప్యం జరుగుతోంది. 2020 డిసెంబరులో అగ్రిమెంట్ చేసుకొని ఏడు కల్వర్టులు నిర్మించారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని పను లు సత్వరమే పూర్తిచేయాలని ఇప్పటికే కాంట్రాక్టర్కు మాడుమార్లు నోటీసులు జారీ చేశాం. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి కాంట్రాక్ట్ను రద్దు చేస్తాం.