రోడ్లపైకి రథ చక్రాలు
ABN , First Publish Date - 2020-05-22T10:30:37+05:30 IST
కరోనా మహమ్మారి విజృంభణతో డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు గురువారం రోడ్లపైకి పరుగులు తీశాయి
జిల్లావ్యాప్తంగా నడిచిన 109 బస్సులు
సూళ్లూరుపేట నుంచి నిల్!
652 ట్రిప్పులకు 436 మాత్రమే
నెల్లూరు (క్రైం), మే 21 : కరోనా మహమ్మారి విజృంభణతో డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు గురువారం రోడ్లపైకి పరుగులు తీశాయి. నెల్లూరు రీజియన్ వ్యాప్తంగా పది డిపోల నుంచి 163 బస్సులు నడపాలని అధికారులు నిర్ణయించుకున్నారు. అయితే కొన్ని డిపోల పరిధిలో బస్సులు రోడ్లపైకి రాలేదు. రెడ్జోన్లు కావడం, ఇతర ప్రాంత అధికారులు అనుమతించకపోవడంతో సర్వీసులు రద్దు చేశారు. ప్రధానంగా సూళ్లూరుపేట డిపో నుంచి ఒక్క బస్సు కూడా బయటకు రాలేదు.
జిల్లావ్యాప్తంగా 436 ట్రిప్పులు
జిల్లావ్యాప్తంగా 163 బస్సులు నడిపేందుకు అధికారులు నిర్ణయించినా 109 బస్సులను మాత్రమే నడిపారు. అదేవిధంగా 652 ట్రిప్పులకు 436 మాత్రమే నడపగలిగారు. తొలిరోజు తిరుపతి, గుంటూరు, విజయవాడ, కడప వంటి దూర ప్రాంతాల వరకే బస్సులు నడపగా శుక్రవారం విశాఖకు బస్సులు నడపనున్నారు.
జాగ్రత్తలు తీసుకుంటూ..
ఆర్టీసీ అధికారులు కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలను గమ్మస్థానాలకు చేర్చారు. బస్టాండులో కౌంటర్ వద్దే టిమ్ మిషన్ల ద్వారా టికెట్లు ఇవ్వడం, బస్సు ఎక్కే సమయంలో భౌతిక దూరం పాటించడం, మాస్క్లు ధరించడం, డ్రైవర్ శానిటైజర్లు వేయడం, బస్టాండులోనే బస్సులు ఆపడం ఇలా అనేక జాగ్రత్తలు తీసుకుంటూ బస్సులు తొలిరోజు నడిచాయి.
భారీ నష్టాల వైపు...
సహజంగానే ఆర్టీసీ బస్సులు నడిచినా ప్రైవేటు వాహనాల దాటికి ఆ సంస్థకు నష్టాలు వాటిల్లుతుంటాయి. ఈ క్రమంలో కరోనా సమయంలో బస్సులోని సీట్ల శాతంలో సగం మాత్రమే కుదించడంతో మరింతగా ఆర్టీసీ నష్టాల వైపు అడుగులు వేస్తోంది. అందులోను బస్సులు నడిపిన తొలిరోజు దూరప్రాంతాలు విజయవాడ, తిరుపతి మినహాయిస్తే మిగిలిన ప్రాంతాకు ప్రయాణికుల తాకిడి ఎక్కువగా కనిపించలేదు.