మినీ బ్యాంకు నిర్వహణకు కంప్యూటర్ల చోరీ
ABN , First Publish Date - 2021-04-13T06:30:38+05:30 IST
ఆ యువకుడిది పేద కుటుంబం. తల్లిదండ్రులు వలస కూలీలు. చదువులో ప్రతిభ చూపి ఎంఎస్సీలో గోల్డ్మెడల్ సాధించాడు. బతుకుదెరువు కోసం గ్రామంలో మినీ బ్యాంకు(వినియోగదారుల సేవాకేంద్రం) నడిపేందుకు అనుమతి పొందాడు. ఆ బ్యాంకు నడపడానికి కంప్యూటర్ల కొనుగోలుకు తగినంత డబ్బు లేనందున చోరీలు చేశాడు.
యువకుడి అరెస్టు
రూ.3 లక్షల విలువైన సొత్తు స్వాధీనం
నూతనకల్, ఏప్రిల్ 12: ఆ యువకుడిది పేద కుటుంబం. తల్లిదండ్రులు వలస కూలీలు. చదువులో ప్రతిభ చూపి ఎంఎస్సీలో గోల్డ్మెడల్ సాధించాడు. బతుకుదెరువు కోసం గ్రామంలో మినీ బ్యాంకు(వినియోగదారుల సేవాకేంద్రం) నడిపేందుకు అనుమతి పొందాడు. ఆ బ్యాంకు నడపడానికి కంప్యూటర్ల కొనుగోలుకు తగినంత డబ్బు లేనందున చోరీలు చేశాడు. సూర్యాపేట జిల్లా నూతనకల్ పోలీ్సస్టేషన్లో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సీఐ రవి వివరాలు వెల్లడించారు. తుంగతుర్తి మండలం సంగెం గ్రామానికి చెందిన ఆశమల్ల ప్రసాద్ ఎంఎస్సీ (మైక్రోబయాలజీ)లో గోల్డ్ మెడల్ సాధించాడు. బతుకుదెరువు కోసం స్వగ్రామంలోనే రెండేళ్ల క్రితం ఓ గదిని అద్దెకు తీసుకుని మినీ బ్యాంకును నిర్వహిస్తున్నాడు. సేవా కేంద్రాన్ని నడపడానికి ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్లను చోరీ చేయడం ప్రారంభించాడు. రెండేళ్ల క్రితం నూతనకల్ మండలం తాళ్లసింగారం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల, ఆత్మకూరు(ఎస్) మండలం పాతర్లపహాడ్ జడ్పీ ఉన్నత పాఠశాల, ఆర్వపల్లి మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాల, అదే మండలం కొమ్మాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రొజెక్టర్లు, కంప్యూటర్లు, సీపీయూలు చోరీ చేశాడు. నెల రోజుల కిత్రం మరో ఇద్దరితో కలిసి వెంకేపల్లి గ్రామంలో వ్యవసాయ మోటర్లను చోరీ చేశాడు. నూతనకల్లో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తూ అనుమానాస్పదంగా సంచరిస్తున్న ప్రసాద్ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేయగా చోరీల విషయం వెలుగుచూసింది. దీంతో నిందితుడి నుంచి పోలీసులు రూ.3 లక్షల విలువైన రెండు కంప్యూటర్లు, నాలుగు ప్రొజెక్టర్లు, రెండు మోటర్లు, జిరాక్సు మిషన్ను స్వాధీనం చేసుకున్నారు.