తీరని కష్టం..

ABN , First Publish Date - 2021-12-01T04:48:10+05:30 IST

వరుణుడు కరుణించాడు. మంగళవారం నాటికి వర్షం నిలిచింది. అయినప్పటికీ వాగులు, వంకల ప్రవాహం ఏ మాత్రం తగ్గలేదు.

తీరని కష్టం..
కృష్ణపట్నం పోర్డు క్రాస్‌రోడ్డు వరకు నిలిచి ఉన్న ట్రాఫిక్‌

తప్పని ట్రాఫిక్‌ వెతలు

వేలాది ఎకరాల నీటమునక

నీటిలోనే దళిత, గిరిజన కాలనీలు  

మూడురోజులుగా రోడ్లపైనే పోలీసులు


మనుబోలు, నవంబరు 30: వరుణుడు కరుణించాడు. మంగళవారం నాటికి వర్షం నిలిచింది. అయినప్పటికీ వాగులు, వంకల ప్రవాహం ఏ మాత్రం తగ్గలేదు. చెరువుల్లోనూ అదే జోరు..అదే హోరు. ఎగువ నుంచి ఏకధాటిగా వస్తున్న వరదతో లోతట్టు ప్రాంతాలన్నీ ఇంకా నీటిలోనే ఉన్నాయి. ఇక వేలాది ఎకరాల వరి పొలాల్లో నాలుగు అడుగుల మేర నీరు నిలిచింది.  వాగులు, వంకలు పక్కనే ఉన్న దళిత, గిరిజన కాలనీలు రెండు రోజులుగా జలదిగ్బంధలోనే ఉన్నాయి. జాతీయ రహదారి అయితే మూడురోజులుగా ప్రయాణికులకు ట్రాఫిక్‌ కష్టాలు తప్పలేదు. సాయంత్రానికి ఆదిశంకర కళాశాల వద్ద రోడ్డుపై వరద స్వల్పంగా తగ్గడంతో పోలీసులు భారీ వాహనాలను పంపే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆదిశంకర కళాశాల నుంచి కాకుటూరు వరకు వేలాది వాహనాలు బారులు తీరాయి. మూడు రోజులుగా కంటిమీద కునుకులేకుండా రేయింబవళ్లు గూడూరు, మనుబోలు, చిల్లకూరు, నెల్లూరు పోలీసులు రోడ్లపై ఉంటూ వాహనాలు వెళ్లేందుకు చర్యలు చేపడుతున్నారు.  నవంబరులోనే వరుసపెట్టి వర్షాలు కురిసి ఇంతగా ఈ ఏడాదే నష్టపోయారని పెద్దలు వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2021-12-01T04:48:10+05:30 IST