మూడు Bus stationsకు నూతన సొబగులు
ABN , First Publish Date - 2021-12-09T15:40:22+05:30 IST
అధునాతన సదుపాయాలతో అభివృద్ధి పరచిన తిరునల్వేలి, మదురై, తంజావూరు నగరాల్లోని బస్స్టేషన్ల ను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ బుధవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. సచివాలయంలో జరిగిన
- ప్రారంభించిన Cm Stalin
చెన్నై: అధునాతన సదుపాయాలతో అభివృద్ధి పరచిన తిరునల్వేలి, మదురై, తంజావూరు నగరాల్లోని బస్స్టేషన్ల ను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ బుధవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. సచివాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో తిరునల్వేలి కార్పొరేషన్ పరిధిలో రూ.13.8కోట్లతో అభివృద్ధిపరచిన పాళయం కోట బస్స్టేషన్ ను ఆయన ప్రారంభించారు. నగరపాలక శాఖ, మంచినీటి సరఫరా శాఖ ఆధ్వర్యంలో రూ.533 కోట్లతో పూర్తయిన 44 పథకాలను కూడా ప్రారంభించారు. నగరపాలక శాఖ ఆధ్వర్యంలో మదురై కార్పొరేషన్ పరిధిలో రూ.55 కోట్లతో మెరుగుపరచిన పెరియార్ బస్స్టేషన్ను, దాని సమీపంలో రూ.2.75 కోట్లతో వాణిజ్య పర్యాటక ప్రాంగణాన్ని ఆయన ప్రారంభించారు. తంజావూరు కార్పొరేషన్లో రూ. 15.49 కోట్లతో అభివృద్ధి చేసిన పాత బస్టాండును, తిరువయ్యారు బస్స్టేషన్ వద్ద రూ.14.44 కోట్లతో నిర్మించిన వాణిజ్య సముదాయాన్ని కూడా స్టాలిన్ ప్రారంభించారు. తిరునల్వేలి కార్పొరేషన్లో రూ.13.20 కోట్ల వ్యయంతో అభివృద్ధి పరచిన భారతరత్న డాక్టర్ ఎంజీఆర్ బస్స్టేషన్లో రూ.11.75కోట్లతో నిర్మించిన కార్ పార్కింగ్, రూ.14.27కోట్ల తో అభివృద్ధి చేసిన ఫుట్ఓవర్ బ్రిడ్జిలను ఆయన ప్రారంభించారు. ఇదేవిధంగా వేలూరు కార్పొరేషన్ పరిధిలో రూ.13.24కోట్లతో నిర్మించిన 2.40 మెగావాట్ల సోలార్ విద్యుత్ కేంద్రం, రూ.5.10 కోట్లతో నిర్మించిన సత్తువాచేరి వాణిజ్య సముదాయం, విరుపాక్షి పురం, కన్నికాపురం ప్రాంతంలో రూ.4.20 కోట్లతో నిర్మించిన పారిశుధ్య కార్మికుల క్వార్టర్స్కు స్టాలిన్ ప్రారంభోత్సవం చేశారు. వివిధ జిల్లాలకు సంబంధించి కార్పొరేషన్ల ఆధ్వర్యంలో రూ.533 కోట్లతో పూర్తయిన పథకాలను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దురైమురుగన్, కేఎన్ నెహ్రూ, ఏవీ వేలు, తంగంతెన్నరసు, సామినాధన్, పి.మూర్తి, పళనివేల్ త్యాగరాజన్, అన్బిల్ మహేశ్ పొయ్యామొళి, కయల్విళి సెల్వరాజ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వి.ఇరై అన్బు తదితర అధికారులు పాల్గొన్నారు.