ఉసురు తీసిన డ్రైవింగ్ సరదా
ABN , First Publish Date - 2022-05-24T05:23:34+05:30 IST
ఉసురు తీసిన డ్రైవింగ్ సరదా
- ఆగి ఉన్న లారీని బైక్తో ఢీకొని యువకుడి దుర్మరణం
- మరొకరి పరిస్థితి విషమం
పొందూరు(ఆమదాలవలస) : బైక్ డ్రైవింగ్ సరదా యువకుడి ఉసురుతీసింది. మరో యువకుడు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషాద ఘట న పొందూరు మండలం ఎరుకులపేట కూడిలిలో సోమవారం జరిగింది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివ రాలిలా ఉన్నాయి. కృష్ణాపురం గ్రామానికి చెందిన మురపాక తేజ (18), వండాన రాజులు స్నేహితులు. బంధువుల ఇంట్లో ఫంక్షన్కు ఇద్దరూ బైక్పై బయలుదేరారు. పొందూరు నుంచి కృష్ణాపురం వైపు వస్తుండగా ఎరుకులపేట కూడలి వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టారు. ఈ ఘటనలో తేజ ఘటనా స్థలంలోనే మృతిచెందాడు. రాజు అపస్మారకస్థితికి చేరుకోవడంతో హుటాహుటిన 108 వాహనంలో శ్రీకాకుళం సర్వజన ఆస్పత్రికి తరలించారు. రాజు పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. తేజ ఇంటర్ చదువుతున్నాడు. తండ్రి గంగులు క్వారీ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. మృతదేహం వద్ద తల్లిందండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎస్ఐ లక్ష్మణరావు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
రణస్థలం : జాతీయ రహదారి పైడిభీమవరం జంక్షన్ వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కోష్ట గ్రామానికి చెందిన బెజ్జిపురం గురునాయుడు (51)మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... కూరగాయల వ్యాపారం చేసుకునే గురునాయుడు ఎప్పటిలాగే సోమవారం ఉదయం కూరగాయలు ఆనందపురం తరలించి తిరిగి ఇంటికి ఆటోపై వస్తుండగా... ప్రమాదవశాత్తు పైడిభీమవరం వద్ద ఆటో డివైడర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో గురునాయుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈయనకు భార్య పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్కు తరలించారు. జేఆర్పురం ఎస్ఐ జి.రాజేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య
కోటబొమ్మాళి: స్థానిక ప్రకాష్నగర్ కాలనీకి చెందిన యువకుడు కాశీ సాయి (20) మనస్తాపంతో సోమవారం తెల్లవారు జామున ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు... తండ్రి గోవిందరావు మద్యానికి బానిస కావడం, వచ్చిన ఆదాయంతో చదువు, కుటుంబ పోషణ భారం కావడంతో సాయి డిగ్రీని మధ్యలో ఆపేశాడు. ఆటో కొనుక్కుని కుటుంబాన్ని పోషిస్తు న్నాడు. ఈ క్రమంతో సాయి కూడా కొద్ది రోజులుగా మద్యానికి అలవాటుపడ్డాడు. తండ్రీ కొడుకులు తరచూ గొడవలు పడుతున్నాడు. ఆదివారం రాత్రి వీరిద్దరి మధ్య ఘర్షణ ఏర్పడింది. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన సాయి రాత్రి ఒంటి గంటవరకు తల్లితో మాట్లాడారు. ఆమె నిద్రలోకి జారుకున్న తర్వాత చీర పట్టుకొని పక్కనే ఉన్న ఎంపీపీ పాఠశాల వంటషెడ్లో ఉన్న పైపునకు ఉరిపోసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఎస్ఐ వై.రవికుమార్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన తెలిపారు.