చేపల వేటకు వెళ్లి యువకుడి మృతి
ABN , First Publish Date - 2020-07-12T10:14:20+05:30 IST
చేపల వేటకు వచ్చిన ఓ యువకుడు కోనాపురం టన్నల్ వద్ద శనివారం శవమై తేలాడు.
కనగానపల్లి, జూలై 11: చేపల వేటకు వచ్చిన ఓ యువకుడు కోనాపురం టన్నల్ వద్ద శనివారం శవమై తేలాడు. కనగానపల్లి ఎస్ఐ సత్యనారాయణ తెలిపిన వివరాల మేరకు.. అనంతపురం రాయల్ నగర్కు చెందిన టీచర్ రామాంజినేయలు కుమారుడు శశాంక్(24) తన స్నేహితులతో కలసి చేపల కోసం శుక్రవారం కోనాపురం టన్నల్ వద్దకు వచ్చాడు. చేపలు పట్టేందుకు ట్యూబ్ మీద టన్నల్ లోపలికి శశాంక్ ఒక్కడే వెళ్ళాడు.
ఎంతసేపయినా శశాంక్ బయటికి రాకపోవడంతో బంధువులకు సమాచారం అందించారు. బంధువులు అక్కడికి వచ్చి వెతికినా శశాంక్ ఆచూకీ దొరక లేదు. శనివారం శశాంక్ శవమై తేలాడు. కనగానపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. టన్నల్లో ఊపిరాడక శశాంక్ మృతి చెందాడా లేక మృతికి గల కారణాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.