ఏడాది వైసీపీ పాలన అట్టర్ఫ్లాప్
ABN , First Publish Date - 2020-06-02T09:29:43+05:30 IST
ఏడాది జగన్ పాలన అట్టర్ఫ్లాప్ అని మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ఎద్దేవా చేశారు.
మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు
నరసాపురం టౌన్, జూన్ 1: ఏడాది జగన్ పాలన అట్టర్ఫ్లాప్ అని మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ఎద్దేవా చేశారు. నియోజకవర్గంలో ఇసుక, తాగునీరు, పంట కాల్వల ప్రక్షాళన, పట్టణంలోని దుకాణాల ఆక్రమణ తొలగింపులపై డెల్టా ప్రాజెక్టుకమిటీ చైర్మన్ పొత్తూరి రామరాజుతో కలసి సబ్ కలెక్టర్ విశ్వనాథన్కు సోమవారం వినతిపత్రం అందించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ జగన్ పాలనలో ఇసుక, మద్యం మాఫియా పెరిగిందన్నారు. తప్పుడు కేసులు బనాయించడం, కక్ష సాధింపులకు పాల్పడడం తప్ప సంక్షేమం ఏమి లేదన్నారు. ఇసుక పుష్కలం గా ఉన్నా బ్లాక్లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. దీని వల్ల వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోతున్నారన్నారు.
పుష్కలంగా నీరు న్నా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులకు అందని పరిస్థితి ఏర్పడిందన్నారు. దీని వల్ల తీర ప్రాంతంలో గత ఏడాది రెండు పంటలను రైతులు నష్టపోయాయన్నారు. తూడును తొలగించి రానున్న సార్వాకు పుష్కలంగా నీరందించాలన్నారు. తీర ప్రాంతంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలన్నారు. పట్టణంలో ఆక్రమణల తొలగింపుకు గడువు ఇవ్వాలన్నారు. ప్రస్తుతం లాక్డౌన్ వల్ల వ్యాపారులు నష్టపోయారన్నారు. టీడీపీ నాయకులు పసుపులేటి రత్నమాల, కొప్పాడ రవి, రాయుడు శ్రీరాములు, జక్కం శ్రీమన్నారాయణ, పొన్నాల నాగబాబు, షేక్ హుసేన్ తదితరులు పాల్గొన్నారు.