‘మన ఊరు-మన బడి’ పనులను వేగవంతం చేయాలి
ABN , First Publish Date - 2022-05-21T04:59:43+05:30 IST
‘మన ఊరు-మన బడి’ పనులను వేగవంతం చేయాలి
యాచారం/కేశంపేట, మే 20: మన ఊరు-మన బడి కార్యక్రమం కింద మండలంలోని ఆయా పాఠశాలల్లో వసతులు కల్పించడానికి ఇంజనీరింగ్ అధికారులు, ఎంఈవో, హెచ్ఎం ప్రత్యేక చొరవ తీసుకోవాలని యాచారం ఎంపీపీ కొప్పు సుకన్యబాషా అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం మన ఊరు మనబడి కార్యక్రమంపై ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్శాఖ, ఎంఈవో, ఎస్ఎంసీ చైర్మన్లు, ఆయా గ్రామాల పాఠశాలల హెచ్ఎంలతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఎంపీపీ మాట్లాడారు. మన ఊరు-మన బడి పథకంలో భాగంగా తొలివిడత 17 పాఠశాలలను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఆయా పాఠశాలల్లో మరమ్మతు పనులు శరవేగంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలల్లో పనులు జరుగుతున్న సమయంలో హెచ్ఎంలు పాఠశాలల్లో ఉండి పనులుపక్కాగా చేయించుకోవాలన్నారు. నాణ్యతలో రాజీలేకుండా పనులు చేయించాలని, లేదంటే చర్యలు తీసుకుంటామని ఎంపీపీ తెలిపారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా పాఠశాలల్లో వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. మొదటివిడత ఆరు ఉన్నత పాఠశాలలు, తొమ్మిది ప్రైమరీ పాఠశాలలు, రెండు ప్రాథమిక పాఠశాలలను ఎంపిక చేసినట్లు తెలిపారు. పాఠశాలల్లో వసతులు కల్పించడానికి దాతలు ముందుకు రావాలని ఆమె విజ్ఞప్తి చేశారు. సమావేశంలో జడ్పీటీసీ జంగమ్మ, ఎంపీడీవో విజయలక్ష్మి, ఎంఈవో రామానుజన్రెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా కేశంపేట మండలంలో ఎంపీడీవో రవిచంద్రకాంత్రెడ్డి మండల పరిషత్ కార్యాలయంలో ఆయా పాఠశాలల హెచ్ఎంలు, ఎస్ఎంసీ చైర్మన్లతో సమావేశమయ్యారు. మండలంలో ఏడు పాఠశాలలకు దాదాపు రూ.2కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఆయా పాఠశాలలో పనులు జూన్ 12లోగా పూర్తిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ తాండ్ర విశాలశ్రావణ్రెడ్డి, సింగిల్విండో చైర్మన్ గండ్ర జగదీశ్వర్గౌడ్, కేశంపేట సర్పంచ్ తలసాని వెంకట్రెడ్డి, ఇన్చార్జి ఎంఈవో మనోహర్, జీహెచ్ఎం రసూల్, పీఆర్ఏఈ భూపాల్ పాల్గొన్నారు.