రైలు కింద పడబోయిన మహిళను కాపాడిన కానిస్టేబుల్
ABN , First Publish Date - 2021-05-06T06:48:51+05:30 IST
రైలు కింద పడబోయిన ఓ మహిళను..
సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియో
తిరుపతి: రైలు కింద పడబోయిన ఓ మహిళను ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చాకచక్యంగా కాపాడిన ఘటన తిరుపతి రైల్వేస్టేషన్లో జరిగింది. బుధవారం వేకువజామున 4.30 గంటలకు తిరుమల ఎక్స్ప్రెస్ తిరుపతి రైల్వేస్టేషన్ నుంచి బయల్దేరింది. శ్రీవారి దర్శనానికి వచ్చిన ఓ మహిళ ఆ రైలులో నిద్రపోతున్నారు. రైలు కదిలే సమయంలో ఆమెకు మెలకువ వచ్చింది. వెంటనే కదులుతున్న రైలు నుంచి ప్లాట్ఫారంపైకి దిగడంతో పట్టుతప్పి కిందపడ్డారు. ఆ తర్వాత జారుతూ ప్లాట్ఫాంకు, రైలుకు మధ్యకు పడబోయారు. ఆ సమయంలో అక్కడ డ్యూటీలోని ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సతీష్ గమనించి.. ఆ మహిళను రైలు కింద పడకుండా రక్షించారు. అక్కడున్న ప్రయాణికులు సతీష్ను అభినందించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.