విజేత రాహుల్
ABN , First Publish Date - 2020-08-05T11:01:55+05:30 IST
వెనుకబడిన నారాయణపేట జిల్లాకు జిల్లా కేంద్రానికి చెందిన రాహుల్ సివిల్స్కు ఎంపికై కీర్తి ప్రతిష్ఠలు తెచ్చాడు
చిన్నతనంలోనే సివిల్స్ సాధించిన నారాయణపేట యువకుడు
యూపీఎస్సీ ఫలితాల్లో ఆల్ ఇండియా 272వ ర్యాంకు
తన విజయం వెనుక తల్లిదండ్రులు, గురువుల కృషి ఎంతో ఉన్నదని వెల్లడి
నారాయణపేట క్రైం, ఆగస్టు 4: వెనుకబడిన నారాయణపేట జిల్లాకు జిల్లా కేంద్రానికి చెందిన రాహుల్ సివిల్స్కు ఎంపికై కీర్తి ప్రతిష్ఠలు తెచ్చాడు. 26 ఏళ్ల వయస్సులోనే సివిల్ సర్వీసెస్కు అర్హత సాధించి, సత్తా చాటాడు. మంగళవారం వెలువడిన యూపీఎస్సీ ఫలితాల్లో ఆల్ ఇండియా లెవల్లో 272 ర్యాంకు సాధించి, పాలమూరు పేరును చాటా చెప్పాడు.
కుటుంబ నేపథ్యం: నారాయణపేట జిల్లా కేంద్రంలోని పర్మారెడ్డికాలనీకి చెందిన బి.నర్సింహులు, శశికళల కుమారుడైన బి.రాహుల్ 1994 ఆగస్టు 19న జన్మించాడు. తండ్రి బి.నర్సింహులు వ్యాయామ ఉపాధ్యాయుడిగా పని చేసి, రిటైర్డ్ అయ్యారు. తల్లి శశికళ హిందీ పండిత్గా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తోంది. సోదరి పుష్యమి నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాలలో లెక్చరర్గా పని చేస్తోంది.
విద్యాభ్యాసం: పదో తరగతి వరకు నారాయణ పేటలోని ఆర్య సమాజ్లో చదివాడు. పదో తరగతిలో 566 మార్కులు సాధించాడు. ఆ తర్వాత హైదరాబాద్ మాదాపూర్లోని శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ చదివాడు. ఇంటర్లో 970 మార్కులు సాధించాడు. ఎంసెట్లో 196 ర్యాంకు, ఏఐఈఈఈలో ఆల్ ఇండియా 2314 ర్యాంకుతో వరంగల్ ఎన్ఐటీలో సీటు సాధించాడు. వరంగల్లో ఎన్ఐటీ చదువుతుండగానే క్యాంపస్ సెలక్షన్స్లో రెడ్డీస్ ల్యాబొరెటరీలో ఉద్యోగం సాధించి, ఆరు నెలల పని చేశాడు. 2015లో విద్యుత్ శాఖలో ఏఈ పోస్టుకు పరీక్ష రాసి, 2016 జనవరిలో ఏఈగా ఎంపికయ్యాడు.
హైదరాబాద్లోని మింట్కంపౌండ్ ఆర్ఆర్లైన్స్ సర్కిల్లో 2018 జూలై వరకు పనిచేశాడు. అనంతరం ఉద్యోగానికి రెండు సంవత్సరాల పాటు లాంగ్ లివ్ పెట్టి, ఢిల్లీలోని వాజిరాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ సివిల్ సర్వీసెస్లో రెండేళ్ల పాటు శిక్షణ తీసుకున్నాడు. 2019 జూన్లో ప్రిలిమ్స్ రాసి, ఉత్తీర్ణత సాధించాడు. సెప్టెంబర్లో మెయిన్స్ పరీక్షలో సైతం ఉత్తీర్ణత సాధించాడు. 2019 జనవరిలో ఢిల్లీలో జరిగిన ఫైనల్ ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. ఇంటర్వ్యూ ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. ఇంటర్వ్యూలో విజయం సాధించి, సివిల్స్కు ఎంపికవడం పట్ల రాహుల్ ఆనందం వ్యక్తం చేశాడు. ఈ ఫలితం వెనుక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, విద్యా బుద్దులు నేర్పిన గురువులు, తోటి స్నేహితుల కృషి ఎంతో ఉందని ‘ఆంధ్రజ్యోతి’తో చెప్పాడు.
సివిల్స్ ఎందుకు చదవాలనుకున్నానంటే..: ‘మహబూబ్నగర్లో ఒకసారి ఉపన్యాస పోటీ నిర్వహించారు. నేనే ప్రతిభ కనబర్చా. అప్పటి ఉమ్మడి మహబూబ్నగర్ కలెక్టర్ ఉషారాణి చేతుల మీదుగా బహుమతి తీసుకున్నా. ఈ సమయంలోనే సివిల్స్ సాధించి, కలెక్టర్ కావాలని అనుకున్నా’ అని రాహుల్ చెప్పాడు. సమాజంలో స్ర్తీ, పురుషులకు సమానత్వం ఉండేలా తన వంతు కృషి చేస్తా. అని అంటున్నాడు.
అభినందించిన ఎస్పీ చేతన: సివిల్స్కు ఎంపికైన రాహుల్ను ఎస్పీ డా.చేతన అభినందించారు. బి.రాహుల్తో ఫోన్లో మాట్లాడారు. ఫ్రిలిమ్స్, మెయిన్స్లో ఉత్తీర్ణత సాధించిన అనంతరం ఫైనల్ ఇంటర్వ్యూకు ఎలా సిద్ధం కావాలో తెలుసుకునేందుకు రాహుల్ ఎస్పీని కలిసి, సూచనలు, సలహాలు తీసుకున్నాడు. తన విజయానికి ఎస్పీ సూచనలు, సలహాలు ఉపయోగపడ్డాయని ఈ సందర్భంగా చెప్పాడు.