ఇటీవలే కరోనాతో భర్త మృతి.. అయితే నష్టపరిహారం కోసం.. భార్య ఏం చేసిందో తెలుసా..
ABN , First Publish Date - 2021-10-01T03:39:40+05:30 IST
కరోనా కారణంగా ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి. మరెందరో ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ఈ క్రమంలో వారి బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా.. ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలు
కరోనా కారణంగా ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి. మరెందరో ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ఈ క్రమంలో వారి బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా.. ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలు నిలదొక్కుకోవాలంటే చాలా ఏళ్లు పడుతుంది. మరోవైపు చాలా కంపెనీలు.. తమ నష్టాలను పూడ్చుకునే క్రమంలో ఉద్యోగులను తొలగించాయి. చెన్నైలో ఇలాంటి ఘటనే జరిగింది. లక్షల జీతం తీసుకునే ఆ ఉద్యోగి.. ఉద్యోగం పోయిన కొన్నాళ్లకు కరోనా బారిన పడి మృతి చెందాడు. దీంతో ఆ ఉద్యోగి భార్య సంచలన నిర్ణయం తీసుకుంది.
రమేష్ సుబ్రమణియన్(48) అనే వ్యక్తి చెన్నైలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్గా పని చేస్తుండేవాడు. కరోనా కారణంగా ఈ ఏడాది ఏప్రిల్లో అతన్ని ఉద్యోగం నుంచి తొలగించారు. నోటీసు పీరియడ్ కూడా ఇవ్వకుండా విధుల నుంచి రిలీవ్ చేశారు. అనంతరం రెండు నెలలకు ఈ ఏడాది జూన్లో అతను కరోనా కారణంగా మరణించాడు. దీంతో ఆ కుటుంబం ఆర్థికంగా దెబ్బతింది.
కంపెనీ కారణంగా తమ కుటుంబం నష్టపోయిందని, నష్టపరిహారం చెల్లించాలని మృతుడి భార్య వాపోయింది. తన భర్తకు ఏడాదికి సుమారు రూ.30లక్షల జీతం వచ్చేదని, కరోనా చికిత్స కోసం రూ.18లక్షలు ఖర్చు చేసినా ఫలితం లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. కంపెనీ వారు నోటీసు పీరియడ్ ఇచ్చుంటే.. రూ.1.5కోట్ల బీమా సొమ్ము వచ్చేదని చెప్పింది.
తమకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. తన భర్త పని చేసిన కంపెనీకి లీగల్ నోటీసు పంపింది. అయితే సుబ్రమణియన్ కుటుంబానికి కేవలం రూ.2 లక్షలు మాత్రమే చెల్లించడానికి కంపెనీ వారు ముందుకొచ్చారు. దీనికి సుబ్రమణియన్ కుటుంబీకులు అంగీకరించలేదు. సుబ్రమణియన్కు వేరే ఉద్యోగం రావడంతోనే రాజీనామా చేశాడని సదరు కంపెనీ తెలిపింది. అయితే కంపెనీ వారు అవాస్తవాలు మాట్లాడుతున్నారని సుబ్రమణియన్ భార్య ఆరోపించింది. తమ సమస్యను కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ దృష్టికి కూడా తీసుకెళ్లింది. అయితే సమస్యను సానుకూలంగా పరిష్కరించుకోవాలని సూచిస్తూ కార్మిక శాఖ.. సదరు కంపెనీకి మెయిల్ చేసింది.