చేనేత కార్మికుల సంక్షేమమే ధ్యేయం
ABN , First Publish Date - 2022-06-29T06:33:54+05:30 IST
చేనేత కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర అల్పసంఖ్యాక మంత్రిత్వశాఖ సెక్రటరీ రేణుక కుమార్ అన్నారు.
కేంద్ర అల్పసంఖ్యాక మంత్రిత్వశాఖ సెక్రటరీ రేణుక కుమార్
భూదానపోచంపల్లి, జూన 28 : చేనేత కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర అల్పసంఖ్యాక మంత్రిత్వశాఖ సెక్రటరీ రేణుక కుమార్ అన్నారు. భూదానపోచంపల్లిని మంగళవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామీణ పర్యాటక కేంద్రంలోని మ్యూజియం సందర్శించి చేనేత మగ్గంపై వస్త్రం తయారీ ప్రక్రియను పరిశీలించారు. చేనేత టైఅండ్డై డిజైన్లను ఆమె పరిశీలించి చేనేత కళాకారుల అద్భుత కళానైపుణ్యాన్ని ప్రశంసించారు. రూరల్ టూరిజం సెంటర్లోని మ్యూజియంలోని టీవ్టుక్లాత ప్రాసెసింగ్ యూనిట్ సందర్శించి కార్మికుల కళాత్మక నైపుణ్యాన్ని అభినందించారు. చేనేత కార్మికుల సమస్యలపై ఆమె చర్చించారు. ఈ సందర్భంగా పోచంపల్లి చేనేత సహకార సంఘం అధికారులు, కార్మిక సంఘం నాయకులు, టైఅండ్డై అసోసియేషన ప్రతినిధులతో కలిసి చర్చించారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు నేరుగా కార్మికులకు అందడం లేవని కార్మిక సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయ లోపం వల్లే ప్రభుత్వ పథకాలు కార్మికుల దరి చేరడం లేవని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత కార్మికుల సంక్షేమం కోసం అమలు చేసే పథకాలు నేరుగా కార్మికులకు అందేట్లు చూడాలని కోరారు. పోచంపల్లి చేనేత డిజైన్లకు పేటెంట్ హక్కులు ఉన్నప్పటికీ కొందరు బడా మిల్లు వ్యాపారులు పోచంపల్లి ఇక్కత డిజైన్లను కాపీ కొడుతున్నారని అన్నారు. చేనేత రిజర్వేషన చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమాల్లో జిల్లా చేనేత,జౌళీ శాఖ ఏడీ విద్యాసాగర్, మున్సిపల్ కమీషనర్ ఎస్ భాస్కర్రెడ్డి, తహసీల్దారు బి.వీరాబాయి, ఆర్ఐ వెంకట్రెడ్డి, జితేందర్ పాల్గొన్నారు.