జయంత్‌ను అఖిలేశ్ ముంచేస్తాడు : అమిత్ షా

ABN , First Publish Date - 2022-02-03T22:09:25+05:30 IST

ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల కోసం కూటమి కట్టిన సమాజ్‌వాదీ

జయంత్‌ను అఖిలేశ్ ముంచేస్తాడు : అమిత్ షా

లక్నో : ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల కోసం కూటమి కట్టిన సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ లోక్‌దళ్‌లను విడదీయడానికి కేంద్ర హోం మంత్రి, బీజేపీ నేత అమిత్ షా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆర్‌ఎల్‌డీ నేత జయంత్ చౌదరిని మచ్చిక చేసుకునేందుకు మరోసారి ప్రయత్నించారు. అఖిలేశ్ యాదవ్ గత చరిత్రను గుర్తు చేస్తూ జయంత్‌ను హెచ్చరించారు.


బులంద్ షహర్‌లో గురువారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అమిత్ షా మాట్లాడుతూ, జయంత్ చౌదరికి అఖిలేశ్ యాదవ్ నచ్చజెప్పి, తన కూటమిలో చేర్చుకోగలిగారని, అయితే తన గళాన్ని వినిపించే అవకాశాన్ని జయంత్‌కు ఇవ్వరని చెప్పారు. ఒకవేళ సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైతే తన గళం మునిగిపోతుందని జయంత్ బాబుకు తెలియడం లేదన్నారు. తన తండ్రి, కుటుంబ సభ్యుల మాటను వినని వ్యక్తి జయంత్ చెప్పే మాటను ఎలా వింటారని ప్రశ్నించారు. అజం ఖాన్ జైలు నుంచి వచ్చి, అఖిలేశ్ యాదవ్ పక్కన కూర్చుంటారన్నారు. అమిత్ షా ఈ విధంగా జయంత్ చౌదరికి గేలం వేయడం ఇది రెండోసారి. 


జనవరి 26న జాట్ నేతలతో సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ, ఆర్ఎల్‌డీ చీఫ్ జయంత్ చౌదరి తప్పుడు గృహాన్ని ఎంచుకున్నారన్నారు. ఆయన కోసం బీజేపీ తలుపులు తెరిచే ఉన్నాయనే సంకేతాలు ఇచ్చారు. 


దీనిపై జయంత్ చౌదరి స్పందిస్తూ, తాను బీజేపీలో చేరే ప్రసక్తే లేదన్నారు. ఆ పార్టీ మతపరమైన ఉద్రిక్తతలను సృష్టించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ఉత్తర ప్రదేశ్‌లో జాట్లను ఏకాకులుగా మార్చడానికి అమిత్ షా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 


సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ యాదవ్‌, ఆయన కుమారుడు అఖిలేశ్ యాదవ్‌ మధ్య సంబంధాలు సక్రమంగా లేని సంగతి తెలిసిందే. జయంత్‌కు అమిత్ షా గేలం వేయడం వెనుక జాట్ల ఓట్లను చీల్చాలనే లక్ష్యం ఉందని విశ్లేషకులు చెప్తున్నారు. మరోవైపు జయంత్‌కు ముస్లింల మద్దతు కూడా ఉందని చెప్తున్నారు. 



Updated Date - 2022-02-03T22:09:25+05:30 IST