దుర్గమ్మా..దర్శనమీయమ్మా..
ABN , First Publish Date - 2020-06-02T09:00:26+05:30 IST
కనకదుర్గమ్మ దర్శనాలను పునరుద్ధరించేందుకు ఆలయ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
విజయవాడ, ఆంధ్రజ్యోతి : కనకదుర్గమ్మ దర్శనాలను పునరుద్ధరించేందుకు ఆలయ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అన్నీ అనుకూలిస్తే.. ఈనెల 8వ తేదీ నుంచి భక్తులకు దర్శన భాగ్యం లభించే అవకాశాలున్నాయి. ఈ దిశగా దుర్గగుడి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా ఉధృతి కొనసాగుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఐదో విడత లాక్డౌన్ నిబంధనలను మరింత సడలిస్తూ ఈనెల 8వ తేదీ నుంచి ప్రార్థనా మందిరాలు, దేవాలయాల్లో దర్శనాలను పునరుద్ధరించే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ ఆలయాలను పునరుద్ధరించేందుకు రాష్ట్ర దేవదాయ శాఖ అనుమతించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై తగిన జాగ్రత్తలు తీసుకుంటూ భక్తులకు ఇబ్బందులు కలగకుండా అమ్మవారి దర్శనం కల్పించే అంశంపై సోమవారం దుర్గగుడి ఉన్నతాధికారులు, ప్రధాన అర్చకులు, వైదిక కమిటీ సభ్యులు సమాలోచనలు చేశారు. ఈవో ఎంవీ సురేష్బాబు, స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్శర్మ, ప్రధాన అర్చకుడు లింగంభట్ల దుర్గాప్రసాద్, ఆలయ వైదిక కమిటీ సభ్యులు, ఇంజనీరింగ్ అధికారులు, ఏఈవోలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.