తాబేళ్ల బతుకు రాత రాస్తోంది!
ABN , First Publish Date - 2021-02-24T06:12:19+05:30 IST
నెమ్మది నెమ్మదిగా సముద్రం ఒడ్డుకు చేరుతున్న తాబేళ్లను చూస్తుంటే ఎంతో ముచ్చటగా అనిపిస్తుంది. అందులోనూ అంతరించిపోయే దశలో ఉన్న రిడ్లే తాబేళ్లు కనిపించగానే ఏదో తెలియని పులకింత...
నెమ్మది నెమ్మదిగా సముద్రం ఒడ్డుకు చేరుతున్న తాబేళ్లను చూస్తుంటే ఎంతో ముచ్చటగా అనిపిస్తుంది. అందులోనూ అంతరించిపోయే దశలో ఉన్న రిడ్లే తాబేళ్లు కనిపించగానే ఏదో తెలియని పులకింత. ఇప్పుడు అవి గుంపులుగా ఇసుక తిన్నెలను దాటి కడలి ఒడిలో వాలుతున్నాయంటే అందుకు కారణం వాటిని కంటికి రెప్పలా కాపాడుతున్న సుప్రజా ధరణి. ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించి, తాబేళ్ల సంరక్షణకు పాటుపడుతున్న ఆమె కృషిని గుర్తిస్తూ అమెరికా ‘ప్రపంచాన్ని మారుస్తున్న 50 మంది మహిళలు’ జాబితాలో ఈ వన్యప్రాణి ప్రేమికురాలికి చోటు కల్పించింది. ఆమె సేవా ప్రయాణంలోకి వెళితే...
చెన్నైలో నివసించే సుప్రజా ధరణిది సముద్రంతో పెనవేసుకున్న అనుబంధం. చిన్నప్పటి నుంచీ సముద్రపు ఒడ్డు, ఇసుక తీరాలంటే ఆమెకు ఎంతో ఇష్టం. ఆ ఇష్టమే తత్వశాస్త్రంలో పరిశోధనలు చేసిన ఆమెకు ఒక వ్యాపకంగా మారుతుందనుకోలేదు. అమెరికాలోని ఎక్స్ప్లోర్ క్లబ్ ఇటీవలే ‘ప్రపంచాన్ని మారుస్తున్న 50 మంది’లో మనదేశం నుంచి సుప్రజను ఎంపిక చేసింది. ‘ఇండియాలో సముద్రపు తాబేళ్ల సంరక్షణకు పాటుపడే వారికి ఇదొక గొప్ప విషయం’ అని ఎక్స్ప్లోర్ క్లబ్ చెప్పడం విశేషం. ‘‘ఈ గౌరవప్రదమైన అవార్డు అందుకోవడం జీవజాతి పరిరక్షణలో మనదేశం ఘనతను చాటుతుంది. అంతేకాదు మనం సముద్ర జీవులు, వన్యప్రాణులను సంరక్షించేందుకు ఎన్నో చర్యలు తీసుకుంటున్నామనే విషయాన్ని ప్రపంచానికి తెలియజేస్తుంది. దక్షిణ భారతదేశం నుంచి ఈ అవార్డు అందుకున్న మొదటి మహిళలను నేను కావడం ఎంతో గర్వగా అనిపిస్తుంది’’ అంటున్నారు సుప్రజ.
ఆ సంఘటనతో గ్లోబల్ జాబితాలో ఉన్న 21మంది మహిళల్లో సుప్రజా ఒకరు. తత్వశాస్త్రంలో పీహెచ్డీ చేసిన సుప్రజా చెన్నైలో కళాకృతి పేరుతో ఆర్ట్షాపు నడుపుతున్నారు. ఆమె తాబేళ్ల సంరక్షణ వైపు ఎలా వచ్చారో తెలుసా.! అది 2001. ఒకరోజు ఉదయాన్నే నీలంకరాయ్ బీచ్కు వెళ్లిన ఆమెకు కొంత దూరంలో ఒక సముద్ర తాబేలు కనిపించింది. ఆమె దానిని భయపెట్టకుండా అలానే చూస్తూ ఉన్నారు. ఎంతసేపటికీ కదలకపోవడంతో ఆ తాబేలు చనిపోయిందని గ్రహించారు సుప్రజ. ఆ తాబేలు ఒళ్లంతా గాయాలు ఉండడం చూసి షాక్ అయ్యారామె. ‘‘చేపలు పట్టే వాళ్లకు ఈ విషయం చెబితే ‘ఇక్కడ అలాంటివి రోజూ జరిగేవే’ అన్నారంతా. వారు అలా చెప్పడం నాకెంతో బాధనిపించింది’’ అని ఒకప్పటి రోజులను గుర్తుచేసుకుంటారు సుప్రజ.
తీర ప్రాంత పోలీసుల సాయంతో..
‘‘ఆంధ్రాలో అడవి పందులు, ఒడిశాలో నక్కలు, అడవి పందుల నుంచి రిడ్లే తాబేళ్లకు ప్రమాదం ఉండేది. అలాగే నెల్లూరులోని ఎన్నాడీ తెగ ప్రజలు గుడ్లు పెట్టేందుకు వచ్చే తాబేళ్లను మాంసం కోసం తాబేళ్లను వేటాడతారు. కానీ మేము వారితో మాట్లాడాక, మాతో కలిసి పనిచేసేందుకు ఒప్పుకున్నారు. మా కార్యక్రమం విజయవంతం కావడంలో తమిళనాడు, ఆంధ్రపద్రేశ్, ఒడిశా రాష్ట్రాల తీర ప్రాంత పోలీసుల సహకారం ఎనలేనిది’’ అంటున్న సుప్రజ తన సంకల్పంతో సముద్ర తాబేళ్ల బతుకు రాత కొత్తగా రాస్తున్నారు.
తమిళనాడు, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లోని యువకులను, ఒక్కటి చేసి సముద్ర తాబేళ్ల రక్షణ దళాన్ని ఏర్పాటు చేశారు సుప్రజ. అందులో ప్రస్తుతం 363 మంది సభ్యులు ఉన్నారు. వారంతా తాబేళ్ల సంరక్షణ కోసం నిరంతరం పాటుపడుతున్నారు.