అణ్వాయుధాల వినియోగంతో మానవాళికి ముప్పు
ABN , First Publish Date - 2022-08-07T06:57:52+05:30 IST
అణ్వాయుధాల వినియోగంతో మానవాళికి ముప్పు
- హిరోషిమా డే ర్యాలీలో జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక
సత్యనారాయణపురం, ఆగస్టు 6: అణ్వాయుధాలను వినియోగించడం వల్ల మానవాళికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని, మానవులంతా శాంతియుతంగా జీవించాలని, సాంకేతికను మానవ అభివృద్ధికి వినియోగించుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక సూచించారు. రీజనల్ సైన్స్సెంటర్ ఆఫ్కాస్ట్ ఆదేశాలతో శనివారం దుర్గాపురం బీఆర్టీఎస్ రోడ్డులో ఎస్టీవీఆర్ నగరపాలక సంస్థ విద్యార్థులు హిరోషిమా డే ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని ప్రారంభించిన ఆమె మాట్లాడారు. మానవ అవసరాలకు వినియోగిస్తున్న అనేక వనరులు తరిగిపోతున్నాయన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో హిరోషిమా డే సందర్బంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించి వారికి బహుమతులు ఇస్తామని తెలిపారు. విద్యార్థులు బీఆర్టీఎస్ రోడ్డులో ర్యాలీ నిర్వహిస్తూ.. ‘అణ్వాయుధాలు వద్దు..అణు ఇంధనాన్ని ప్రపంచ మానవాళి అవసరాలకు వినియోగించాలి’ అని నినాదాలు చేశారు. జిల్లా సైన్స్ అధికారి మైనం హుస్సేన్, సైన్స్ ఉపాధ్యాయులు శ్యాంప్రసాద్, పాలకొల్లు శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
యుద్ధాన్ని వీడి..శాంతిని కాంక్షించాలి
పటమట: ప్రపంచ దేశాలు యుద్ధాలు- అణుబాంబులను విడనాడి శాంతిని కాంక్షించాలని మారిస్ స్టెల్లా కళాశాల ఫిజిక్స్ విభాగం అధిపతి డాక్టర్ లిటిల్ ఫ్లవర్ తెలిపారు. కళాశాల ఫిజిక్స్ విభాగం, ఫిజిక్స్ ఇన్స్పైర్ క్లబ్ సంయుక్తంగా శనివారం ‘ఏ వరల్డ్ ఫ్రీ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థినులు పీస్ మార్చ్ నిర్వహించారు. షిరోషిమా, నాగసాకిలపై అణుబాండు దాడి జరిగిన 77 ఏళ్లు గడిచినా దాడి మిగిల్చిన విషాదం ప్రపంచానికి గుణపాఠం నేర్పిందని, యుద్ధాలు, అణు బాంబులు మానవాళిపై తీవ్ర ప్రభావం చూపుతాయని లిటిల్ ఫ్లవర్ అన్నారు. అణు బాంబులు తీవ్ర పరిణామాలు, ప్రపంచ శాంతిని దేశాలు ఎలా సాధించాలి అనే అంశాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించాలని ఈ కార్యక్రమం నిర్వహించామని కరస్పాండెంట్ సిస్టర్ స్లీవా తెలిపారు. యుద్ధాలు విడ నాడాలి..అణు బాంబులు మానవ మనుగడకి అవరోధాలు అనే నినాదాలతో విద్యార్థినులు ర్యాలీలో పాల్గొన్నారు. డిగ్రీ వైస్ ప్రిన్సిపాల్ కె.అనూహ్య, టి.గ్రేస్ యూనిస్, పి.పద్మలత, కుమారి, పాండురంగారావు, స్వప్న పాల్గొన్నారు.