యాడికిలో రూ.2 లక్షలు చోరీ
ABN , First Publish Date - 2020-06-02T09:51:02+05:30 IST
కష్టార్జిత సొమ్ము రూ.2లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేద్దామని వచ్చిన నారాయణరెడ్డి అనే వృద్ధుడి నుంచి దొంగలు
వృద్ధుడి నుంచి డబ్బు కొట్టేసిన దొంగలు
యాడికి, జూన్1: కష్టార్జిత సొమ్ము రూ.2లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేద్దామని వచ్చిన నారాయణరెడ్డి అనే వృద్ధుడి నుంచి దొంగలు డబ్బులు కొట్టేసిన సంఘటన సోమవారం మండలంలోని రాయలచెరువు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు వద్ద జరిగింది. పెద్దవడుగూరు మండలం రావులుడికి గ్రామానికి చెందిన వృద్ధ రైతు నారాయణరెడ్డి తన కష్టార్జిత సొమ్ము రూ.2లక్షలను రాయలచెరువులోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో డిపాజిట్ చేయాలని డబ్బులను జేబులో పెట్టుకుని రాయలచెరువు బస్టాండ్కు చేరుకున్నాడు.
అక్కడ డబ్బును సరిచూసుకుని బ్యాంకుకు వెళ్లాడు. బ్యాంకులో డిపాజిట్ చేయడానికి దరఖాస్తు పూర్తిచేసి డబ్బులు చూసుకోగా లేవని నారాయణరెడ్డి లబోదిబోమన్నాడు. రోడ్డువెంబడి రోదిస్తూ వెళ్తుండగా స్థానికులు ఆరాతీసి వృద్ధుడిని బ్యాంకు వద్దకు తీసుకెళ్లి మేనేజర్తో మాట్లాడి సీసీ పుటేజీని పరిశీలించారు. కానీ ఎక్కడా ఆధారాలు కనిపించకపోవడంతో ఏమిచేయాలో దిక్కుతోచని స్థితిలో నారాయణరెడ్డి బ్యాంకులో కిందపడి రోదించడం కలిచివేసింది.