దొంగ బంగారం పేరుతో మోసం

ABN , First Publish Date - 2020-09-30T11:30:06+05:30 IST

దొంగ బంగారం కొనడానికి వచ్చి రూ. 5 లక్షలు పోగొట్టుకొన్న సంఘటన మంగళవారం అనంతపురం జిల్లా గుత్తిలో ..

దొంగ బంగారం పేరుతో మోసం

గుంతకల్లు, సెప్టెంబరు 29 : దొంగ బంగారం కొనడానికి వచ్చి రూ. 5 లక్షలు పోగొట్టుకొన్న సంఘటన మంగళవారం అనంతపురం జిల్లా గుత్తిలో జరిగింది. కడప జిల్లా మైదుకూరుకు చెందిన సుబ్బరాయుడు, అతడి అక్క రామతులసి, స్నేహితుడు నరేశ్‌లకు ఫోన్‌లో పరిచయమైన గుర్తు తెలియని వ్యక్తులు దొంగబంగారం ఇస్తామని ఆశ చూపారు. అర కేజీ బంగారం ఉందని రూ. 5 లక్షలకు ఇస్తామని ఆశ చూపారు. దీంతో మైదుకూరు బ్యాంకులో డబ్బును డ్రాచేసి వాహనంలో బయలుదేరారు. అలాగే వీరి బంధువులు కర్నూలు నుంచి సురేంద్ర, లక్ష్మిప్రియ గుత్తికి చేరుకుని స్థానిక ఆర్టీసీ బస్టాండుకు రాగా మైదుకూరు నుంచి వచ్చినవారితో భేటీ అయ్యారు. వీరందరూ కలసి దొంగ బంగారం అమ్ముతా మని ఫోనులో పరిచయమైన వ్యక్తులకు కాల్‌ చేశారు.


పత్తికొండ రోడ్డులోని చెట్నేపల్లి రైల్వే గేటు వద్దకు వస్తే బంగారాన్ని ఇస్తామని నమ్మబలికారు. దీంతో వారు అక్కడకు కారులో చేరుకుని వారితో మాట్లాడారు. డబ్బు సక్రమంగా ఉందో, లేదో లెక్కించాలని వారు తెలపగా, డబ్బున్న బ్యాగును బైటకు తీశారు. దొంగబంగారం అమ్మడానికి వచ్చిన వారు డబ్బున్న బ్యాగును, సుబ్బరాయుడి సెల్‌ఫోన్‌ను తీసుకుని బైకుల్లో పరారయ్యారు. తేరుకుని వారిని వాహనంలో వెంటాడినా తప్పించుకుపోయినట్టు బాఽధితులు తెలిపారు. వీరు స్థానిక సీఐ రాజశేఖరరెడ్డికి ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలియజేశారు. 


Updated Date - 2020-09-30T11:30:06+05:30 IST