జడ్జిల పదవీ కాలానికి గ్యారంటీ ఉండాలి
ABN , First Publish Date - 2021-04-16T07:09:54+05:30 IST
న్యాయమూర్తులపై వస్తున్న ఆరోపణల్లో కొన్ని అవాస్తవిక ఆరోపణలు కూడా ఉంటున్నాయని
మహిళ సీజే కావాల్సిన టైమొచ్చింది: సుప్రీం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: న్యాయమూర్తులపై వస్తున్న ఆరోపణల్లో కొన్ని అవాస్తవిక ఆరోపణలు కూడా ఉంటున్నాయని సుప్రీంకోర్టు తెలిపింది. జడ్జిల పదవికి భద్రత లేకపోతే ఆరోపణలు చేయడం ద్వారా వారిని సులభంగా తప్పించవచ్చని పేర్కొంది. తాత్కాలిక న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా సీజే బోబ్డే ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. హైకోర్టుల్లో పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించే కృషిలో భాగంగా తాత్కాలిక జడ్జిలను నియమించాలని సుప్రీంకోర్టు భావిస్తోంది. హైకోర్టుల్లో నియమించే తాత్కాలిక జడ్జిల పదవీ కాలం రెండేళ్లు ఉండాలని ధర్మాసనం పేర్కొంది.
జడ్జిల నియామకాలపై సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసే పేర్లను ఆమోదించేందుకు నిర్ధారిత గడువును చెప్పాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని అడిగింది. ఏడాదిన్నర క్రితం కొలీజియం పంపిన పది పేర్లు ఇంకా ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్నాయని సీజే శరద్ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఏజీ వేణుగోపాల్కు తెలిపింది. కాగా, దేశ అత్యున్నత న్యాయస్థానానికి ఓ మహిళ నేతృత్వం వహించే తరుణం వచ్చిందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.