రైతన్న‌కు తెలంగాణ స‌ర్కార్ చేసిందేమీ లేదు: విజయశాంతి

ABN , First Publish Date - 2022-02-10T02:01:43+05:30 IST

రైతన్న‌కు తెలంగాణ స‌ర్కార్ చేసిందేమీ లేదు: విజయశాంతి

రైతన్న‌కు తెలంగాణ స‌ర్కార్ చేసిందేమీ లేదు: విజయశాంతి

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ నాయకురాలు విజయశాంతి విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ స‌ర్కార్ రైతు ఆత్మహత్యల రాష్ట్రంగా మార్చిందని, రైతన్న‌కు తెలంగాణ స‌ర్కార్ చేసిందేమీ లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడిన 7 ఏళ్లలో  7,409 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో నివేదిక తెలిపిందని విజయశాంతి గుర్తు చేశారు. సోషల్ మీడియాలో రాములమ్మ పోస్టు యథాతథంగా..


''రైతు దేశానికి వెన్నుముక. కానీ అలాంటి రైతన్న‌కు తెలంగాణ స‌ర్కార్ చేసిందేమీ లేదు. నలుగురికీ అన్నం పెట్టే రైతులు ఆత్మహత్యలకు పాల్ప‌డుతూ... వారి కుటుంబాలు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లుతుంటే ప్ర‌భుత్వం చోద్యం చూస్తోంది. తెలంగాణ రాష్ట్రం వ‌స్తే  రైతు సమస్యలు సమసిపోతాయని నాడు రైతులు కూడా ఉద్యమాలలో పాల్గొన్నారు. కానీ నేడు సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ స‌ర్కార్ రైతు ఆత్మహత్యల రాష్ట్రంగా మార్చింది. తెలంగాణ ఏర్పడిన ఈ ఏడేండ్ల కాలంలో 7,409 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో నివేదిక తెలిపింది. కేవలం ఈ ఒక్క ఏడాదిలోనే వెయ్యి మందికి పైగా రైతులు చనిపోవడం ఆందోళన క‌లిగిస్తోంది. కేసీఆర్ ప్ర‌భుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్ర‌వేశ‌పెట్టిన రైతు బంధు పెద్ద‌ల జేబులోకి వెళ్లుతుంటే... చిన్న, సన్నకారు రైతుల రైతు బంధు డ‌బ్బును మాత్రం బ్యాంకర్లు రాబందుల్లా మారి వడ్డీ కింద జమ చేసుకుంటూ రైతన్న‌లకు పైసా కూడా ఇవ్వడం లేదు. 2018 ఎన్నికల సమయంలో లక్ష వరకు రుణ మాఫీ చేస్తామని ప్రకటించినా నేటికీ అది సాధ్యం కాలేదు. వానా కాలంలో ఇవ్వాల్సిన క్రాప్ లోన్‌‌‌‌లు ఇవ్వకుండా రైత‌న్న‌ల ఉసురు తీస్తుండ్రు. కేవలం రూ.30 వేల వరకు రుణమాఫీ చేసిన ప్రభుత్వం.... రుణమాఫీ చేసేశామని అబద్ధాలు ప్రచారం చేసుకుంటోంది. వ్యవసాయంలో ఏటా పెట్టుబడులు పెరుగుతున్నప్పటికీ... ఆ మేరకు దిగుబడి రాక రైతన్న‌లు క్రమంగా అప్పుల ఊబిలోకి నెట్టి వేయబడుతున్నా... తాను రైతునని చెప్పుకునే కేసీఆర్ ఏం చేసిండు? రైతులు ప్రైవేటు వ్యక్తుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు తేవడం... చివరకు దిగుబడి తక్కువ రావడంతో అప్పులు పెరిగిపోవడం... దీనికి తోడు పిల్లల చదువులు, పెళ్లిళ్లు, పండుగల వల్ల‌ ఇంకా అప్పులు పెరిగి ఎక్కువై... తీర్చే మార్గం కనిపించడం లేదు. దాంతో తీవ్రమైన మనోవేదనకు గురై... అనారోగ్యం పాలై చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా దొర‌వారి స‌ర్కారుకు చీమ కుట్టినట్ట‌యినా లేదు. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సాక్షాత్తు మన సీఎం ప్రెస్ మీట్‌‌‌‌లోనే... యాసంగిలో రైతులెవరూ వరి పంట సాగు చేయొద్ద‌ని ప్రకటించి... రైతులు మరింత మానసిక వేదనకు గురయ్యేలా చేస్తుండు. ధైర్యం ఇవ్వాల‌సిన ముఖ్య‌మంత్రి రైతులు కుంగిపోయేలా చేసి... ఆ తప్పులు కేంద్రం మీద వేసి రాజ‌కీయ ప‌బ్భం గ‌డుపుకుంటుండు. నీ ఆటలు రైతుల‌ ద‌గ్గ‌ర సాగ‌వు కేసీఆర్.... యావత్ తెలంగాణ రైతాంగం నీకు బుద్ధి చెప్ప‌డం ఖాయం.'' అని విజయశాంతి అన్నారు.



Updated Date - 2022-02-10T02:01:43+05:30 IST