టార్గెట్ 25 వేల కోట్లు
ABN , First Publish Date - 2022-07-13T08:02:39+05:30 IST
టార్గెట్ 25 వేల కోట్లు
బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా తెచ్చే ప్లాన్
ఇప్పటికే 8,300 కోట్లు తెచ్చేసిన సర్కారు
అమరావతి, జూలై 12 (ఆంధ్రజ్యోతి): అప్పులిచ్చేందుకు బ్యాంకులు ముందుకు రాకపోవడంతో కార్పొరేషన్లను అడ్డం పెట్టుకుని జగన్ ప్రభుత్వం రూ.వేల కోట్లు తెస్తోంది. జూన్లో బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లు ఇష్యూ చేసిన సర్కారు... మార్కెట్ నుంచి రూ.8,300 కోట్లు అప్పు తెచ్చుకుంది. ఇప్పుడు కొత్తగా అదే కార్పొరేషన్ ద్వారా మరో 25వేల కోట్లు అప్పు తెచ్చేందుకు కసరత్తులు చేస్తోంది. సూట్కేస్ కార్పొరేషన్ల ద్వారా బ్యాంకుల నుంచి కేంద్రానికి తెలియకుండా రాజ్యాంగ విరుద్ధంగా జగన్ ప్రభుత్వం రూ.వేల కోట్ల అప్పులు తెచ్చింది. ఇలా దొంగ అప్పులు తేవడం కోసమే ఏపీఎ్సడీసీని ఏర్పాటు చేసి ఖజానాకు రావాల్సిన మద్యం ఆదాయాన్ని మళ్లించడాన్ని కేంద్రం తప్పు పట్టింది. ఏపీలోని కార్పొరేషన్లకు అప్పులిచ్చే ముందు ఆలోచించుకోవాలని బ్యాంకులను ఆదేశించింది. ప్రభుత్వ గ్యారంటీలు చూసి కార్పొరేషన్లకు రుణాలు ఇవ్వొద్దని ఆర్బీఐ హెచ్చరించడంతో బ్యాంకులు ఏపీవైపు చూడటం మానేశాయి. దీంతో బేవరేజస్ కార్పొరేషన్కు చట్టబద్ధ హోదా కల్పించిన జగన్ ప్రభుత్వం... స్పెషల్ మార్జిన్ పేరుతో మద్యం ఆదాయాన్ని మళ్లించి, దాన్ని ఆ కార్పొరేషన్ ఆదాయంగా చూపిస్తూ అప్పుల కోసం డిబెంచర్లు ఇష్యూ చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ప్రభుత్వం 34,190కోట్లు అప్పు చేసింది. ఆర్బీఐ ద్వారా రూ.25,890 కోట్లు, బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా రూ.8,300కోట్ల అప్పు తెచ్చారు. తాజాగామరో 25వేల కోట్ల అప్పుకోసం జగన్ సర్కారు ప్రయత్నిస్తోంది.