పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి
ABN , First Publish Date - 2020-06-07T08:29:30+05:30 IST
వేట్లపాలెంలో గ్రామ సచివాలయాల ఆవరణ , ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణ, ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం
సామర్లకోట, జూన్ 6: వేట్లపాలెంలో గ్రామ సచివాలయాల ఆవరణ , ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణ, ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం ప్రాంతాలు పరిశుభ్రంగా లేకపోవడంపై జాయింట్ కలెక్టర్ చేకూరి కీర్తి అసహనం వ్యక్తం చేశారు. ఇలా అయితే సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందుతాయని అన్నారు. వెంటనే పరిస్థితిని మెరుగుపర్చాలని సిబ్బందిని ఆదేశించారు. సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామాన్ని జేసీ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ముందుగా పీహెచ్సీ ఆవరణను పరిశీలించి తుప్పలు చెత్తా చెదారాలతో నిండి ఉండడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో పరిస్థితిపై వైద్యాధికారి డాక్టర్ సీహెచ్ ధనలక్ష్మితో సమీక్షించారు. కొవిడ్-5వ విడత సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని మరో వారం రోజులలో ఆస్పత్రి పనితీరుపై సమీక్షిస్తామని చెప్పారు. గ్రామంలో పారిశుఽధ్యాన్ని ఇంకా మెరుగుపర్చాలని పంచాయతీ కార్యదర్శి రమణను ఆదేశించారు. జేసీ వెంట తహశీల్దార్ జితేంద్ర, ఎంపీడీవో అబ్బిరెడ్డి రమణారెడ్డి, ఈవోపీఆర్డీ కేవీ సూర్యనారాయణ, గోలి వెంకట్రావు తదితరులు ఉన్నారు.