తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శం
ABN , First Publish Date - 2022-06-02T05:30:00+05:30 IST
తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శం
- అన్నిరంగాల్లో రాష్ట్రం ముందడుగు
- అనతి కాలంలోనే అద్భుత విజయాలు
- ప్రభుత్వ పథకాల అమలుపై విదేశాల ప్రశంసలు
- రాష్ట్ర అవతరణ వేడుకలో విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి
రంగారెడ్డి అర్బన్, జూన్ 2 : తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం జిల్లాలో తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సరూర్నగర్లోని ఇండోర్ స్టేడియంలో అమరవవీరుల చిహ్నం వద్ద మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, జిల్లా కలెక్టర్ అమయ్కుమార్, అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా కలెక్టరేట్ వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ ఉత్సవంలో భాగంగా జీవనజ్యోతి జిల్లా మహిళా సమాఖ్య (558ఎస్హెచ్జిఎ్స)కు రూ.26.65 కోట్ల చెక్కును అందజేశారు. ఈసందర్భంగా మంత్రి సబిత మాట్లాడుతూ నిరంతర ప్రగతిశీల రాష్ట్రంగా తెలంగాణ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుందన్నారు. అనతికాలంలోనే అద్భుత విజయాలు సాధిస్తూ అన్నిరంగాల్లో రాష్ట్రం ముందడుగు వేస్తోందన్నారు. ప్రభుత్వ పథకాల అమలు తీరుపై విదేశాల నుంచి ప్రశంసలు అందుతున్నాయని తెలిపారు. జిల్లాలో ధరణి సమర్ధవంతంగా అమలవుతుందని, ఇప్పటివరకు భూ సంబంధిత లావాదేవీలకు సంబంధించి 1.38లక్షల దరఖాస్తులు రాగా అందులో 1.33లక్షల దరఖాస్తులను పరిష్కరించినట్టు వివరించారు. దళితబంధు పథకం ద్వారా ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఆర్థిక సహాయం అందించినట్లు చెప్పారు. జిల్లాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 697మంది లబ్ధిదారులను ఎంపిక చేసి రూ.56.03 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశామన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న సంకల్పంతో వారికి గ్రూప్స్లలో ఉచిత శిక్షణ ఇవ్వడానికి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు కలిపి హైదరాబాద్ బీసీ స్టడీ సర్కిల్ను ఏర్పాటు చేశామన్నారు. ఎక్సైజ్ కానిస్టేబుల్స్, పోలీస్ కానిస్టేబుల్స్, టీఎ్సపీఎ్ససీ, గ్రూప్-2, బ్యాంక్ క్లర్క్, వీఆర్ఏ, పంచాయతీ కార్యదర్శి తదితర అంశాలకు ఉచిత కోచింగ్ ఇస్తున్నట్లు చెప్పారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం క్రీడా ప్రాంగణాలు ఏర్పాటుకు చర్యలు చేపట్టిందన్నారు. జిల్లాలో మొదటగా మండలానికి రెండు మోడల్ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో 6,777 డబుల్ బెడ్రూం ఇళ్లు మంజరు చేశామని, వీటిలో 2,637 పురోగతిలో ఉన్నాయన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 16వేల డబుల్ బెడ్రూం ఇళ్లు దాదాపు పూర్తి కావాచ్చాయన్నారు. వాటిని అర్హులైన లబ్ధిదారులకు కేటాయించామని చెప్పారు. కల్యాణలక్ష్మి, షాదీవ ుుబారక్ కింద 13,697మందికి రూ.137.12 కోట్ల ఆర్థిక సహాయం అందించామన్నారు.
‘పల్లెప్రగతి’కి ప్రతినెలా రూ.9.8 కోట్లు
పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని 558 గ్రామ పంచాయతీలకు ప్రతినెలా 9కోట్ల 8 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసి జిల్లాలోని 16 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను అభివృద్ధి చేసుకుంటున్నామని మంత్రి సబిత అన్నారు. ఈ పథకం అమలుకు ఇప్పటివరకు 335.32 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. జిల్లాలో రూ. కోటీ20లక్షల వ్యయంతో 6గ్రామ పంచాయతీ భవనాలను నిర్మించినట్టు మంత్రి చెప్పారు. పట్టణప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రతి నెలా సుమారు 2కోట్ల 12 లక్షల రూపాయల నిధులు మంజూరు చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు రూ.57.14 లక్షలు మంజూరు చేశామని మంత్రి తెలిపారు. అదేవిధంగా హరితహారం ద్వారా 558 గ్రామ పంచాయతీల్లో నర్సరీలను ఏర్పాటు చేసి కోటీ 44 మొక్కలు పెంచామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. 8వ విడత హరితహారంలో 77లక్షల మొక్కలు నాటాలన్న లక్ష్యాన్ని నిర్ధారించడం జరిగిందని చెప్పారు.
పరిశ్రమల ఏర్పాటుతో ఉపాధి
టీఎస్ ఐపాస్ కింద రూ. 71,674 కోట్ల పెట్టుబడితో 1,408 పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు వివిధ శాఖల అనుమతుల కోసం దరఖాస్తులు చేసుకున్నాయని తెలిపారు. ఇందులో రూ.42,356 కోట్ల పెట్టుబడితో 1,095 పరిశ్రమలు ఏర్పాటైనట్లు చెప్పారు. వీటిద్వారా 4,63,486మందికి ఉపాధి అవకాశాలు ఏర్పాటు చేశామని మంత్రి సబిత అన్నారు. పీఆండ్జీ, వెల్స్పేస్, విప్రో, పోకర్ణ, ప్రీమియర్ ఎనర్జీస్, రేడియంట్, చిర్పాల్ తదితర సంస్థలు తమ పరిశ్రమలను ఏర్పాటు చేశాయని వెల్లడించారు.
జిల్లాలో 25 సబ్స్టేషన్లు మంజూరు..
రైతులకు 24 గంటల విద్యుత్ను అందించడం వల్ల జిల్లాలో 1,87,500 మంది రైతులు లబ్ధి పొందుతున్నారని మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 33/11 కేవీ సబ్స్టేషన్లు 230 పూర్తి చేశామన్నారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో 95 కోట్ల 80 లక్షల రూపాయలతో 25 సబ్స్టేషన్లు మంజూరు చేశామన్నారు.
ముమ్మరంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులు
మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నారాయణపేట, రంగారెడ్డి, వికారాబాద్, నల్లగొండ జిల్లాల్లో 10లక్షల 23వేల ఎకరాలకు సాగు, తాగునీరు అందించే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కెనాల్ నెట్వర్క్ 2వ దశ పనులు ముమ్మరంగా సాగుతున్నాయని మంత్రి సబిత తెలిపారు. ఈ ప్రాజెక్టు కింద రంగారెడ్డి జిల్లాలో 20 మండలాలకు చెందిన 330 గ్రామాల్లో 3,59,047 ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందుతుందని చెప్పారు.
నగరానికి నాలుగు వైపులా 4 మల్టీస్పెషాలిటీ ఆసుపత్రులు.
పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణగా ప్రజలకు ఉచితంగా వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో నగరానికి నాలుగువైపులా నాలుగు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మించాలని నిర్ణయించడం జరిగిందని తెలిపారు. గడ్డిఅన్నారం, సనత్నగర్, అల్వాల్లో ఆసుపత్రుల నిర్మాణాలకు శంకుస్థాపన చేశామని సబిత చెప్పారు. కరోనా మహమ్మారిని జిల్లాలో విజయవంతంగా నియంత్రించామన్నారు. కొవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడంలో జిల్లా ప్రథమ స్థానంలో ఉందని చెప్పారు. జిల్లాలో ఇప్పటివరకు మొదటి డోస్ వాక్సిన్ను 29,46,883 మందికి, రెండో డోసు 25,65,203 మందికి కరోనా వ్యాక్సిన్లు ఇచ్చినట్లు ఆమె తెలిపారు. 15 నుంచి 17 ఏళ్ల వయస్సు ఉన్న 2,35,222మంది పిల్లలకు, 12 నుంచి 14 ఏళ్లు ఉన్న 81,934 మంది పిల్లలకు ఫస్ట్ డోస్ ఇచ్చామన్నారు. 22,892 మంది పిల్లలకు సెకండ్ డోస్ ఇచ్చామని తెలిపారు. 60 సంవత్సరాలు పైబడిన వారితో పాటు ఫ్రంట్లైన్ వారియర్స్ 69,229 మందికి ప్రికాషనరీ డోస్ ఇచ్చామని మంత్రి సబిత చెప్పారు.
250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్..
రాష్ట్రంలో నాయీ బ్రాహ్మణులు, రజకులు నిర్వహిస్తున్న కటింగ్ షాపులు, లాండ్రీ షాపులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందని, ఈ పథకం కింద ఇప్పటి వరకు 12,781 మంది నాయీ బ్రహ్మణులు, 4,321 మంది రజకులకు 9 మంది దోబీఘాట్ల నిర్వాహకులు దరఖాస్తు చేసుకున్నారని, వీరిలో 927 మంది నాయీ బ్రహ్మణులకు, 3,303 మంది రజకులకు కరెంట్ కనెక్షన్లు ఇచ్చామన్నారు. మిగిలిన వారికి కొత్తగా విద్యుత్ కనెక్షన్ ఇచ్చే ప్రక్రియ జరుగుతుందని తెలిపారు.
రూ.612.69కోట్ల రుణాలు..
2021-22 సంవత్సరంలో 12,650 సంఘాల సభ్యులకు రూ.612.69 కోట్ల బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు మంజూరు చేశామని మంత్రి సబిత తెలిపారు. 2021-22 సంవత్సరానికి రూ.105.25 కోట్లు స్ర్తీనిధి బ్యాంకు ద్వారా రుణాలు మంజూరు చేశామని, జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద రూ. 12.60 కోట్లు వ్యయ వేతనంతో 7.5 లక్షల పనిదినాలు కల్పించడం జరిగిందన్నారు. రైతుబంధు పథకంలో భాగంగా 2021 వానాకాలంలో 2,84,094 మంది రైతుల ఖాతాల్లో 343.41 కోట్లు జమ చేశామని, 2021-22 యాసంగిలో 2,93,541 మంది రైతుల ఖాతాల్లో 343.79 కోట్లు జమ చేశామని చెప్పారు. రైతుబీమా పథకం కింద 629 మంది రైతులకు ఒక్కొక్కరికి 5లక్షల చొప్పున రూ.31.45 కోట్లు జమ చేశామని చెప్పారు. జిల్లాలో 83 రైతు వేదికలను నిర్మించి వినియోగంలోకి తీసుకు వచ్చామన్నారు. యాసంగిలో జిల్లాలో 41,215 మంది రైతుల నుంచి లక్షా 18వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల నిల్వకు 75,900 టన్నుల సామర్థ్యం కలిగిన 29 గోదాములు ఏర్పాటు చేశామన్నారు. పశుసంవర్ధక శాఖ ద్వారా జిల్లాలో 368 గ్రామాల్లో గొర్రెకాపరుల సంఘాలు ఏర్పాటు చేసి 41,694 మంది సభ్యులకు సుమారు రూ.146 కోట్ల వ్యయంతో ఇప్పటివరకు 11,663 యూనిట్లను పంపిణీ చేశామని మంత్రి చెప్పారు. రెండోదశ గొర్రెల పంపిణీ త్వరలో చేపడతామన్నారు. నీలి విప్లవం ద్వారా మత్స్యకారులకు వంద శాతం సబ్సిడీతో 794 చెరువుల్లో 161 లక్షల చేప పిల్లలను వదిలామని తెలిపారు.