స్టాండింగ్ కమిటీ ఎన్నికలో నిబద్ధతతో ఓటు వేయాలి
ABN , First Publish Date - 2021-07-25T05:50:43+05:30 IST
జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలో కార్పొరేటర్లు నిబద్ధతతో ఓటు హక్కు వినియోగించుకోవాలని జీవీఎంసీ మేయర్ జీహెచ్వీ కుమారి, కమిషనర్ డాక్టర్ జి.సృజన కోరారు.
విశాఖపట్నం, జూలై 24(ఆంధ్రజ్యోతి): జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలో కార్పొరేటర్లు నిబద్ధతతో ఓటు హక్కు వినియోగించుకోవాలని జీవీఎంసీ మేయర్ జీహెచ్వీ కుమారి, కమిషనర్ డాక్టర్ జి.సృజన కోరారు. స్టాండింగ్ కమిటీకి ఈ నెల 27న ఎన్నిక జరగనున్నందున ఓటు హక్కు వినియోగంపై కార్పొరేటర్లకు పాత కౌన్సిల్ హాల్లో శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్, కమిషనర్లు మాట్లాడుతూ స్టాండింగ్ కమిటీ ఆవశ్యకత, పనితీరు గురించి వివరించారు. ఓటుహక్కు వినియోగం, తిరస్కరణ అంశాలపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జీవీఎంసీ సలహాదారు జీవీవీఎస్ మూర్తి వివరించారు. అనంతరం కార్పొరేటర్ల సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఏవీ రమణి, కార్యదర్శి లావణ్య పాల్గొన్నారు.