కన్నకొడుకే.. కాలయముడై..!
ABN , First Publish Date - 2022-01-29T05:23:07+05:30 IST
కన్నకొడుకే.. కాలయముడై..!
- తండ్రిని హత్యచేసిన కుమారుడు
- ఆస్తికోసం ఘాతుకం
- సిగలపుట్టుగలో దారుణం
హరిపురం, జనవరి 28: ఆ తండ్రి పాలిట కన్నకొడుకే కాలయముడయ్యాడు. ఆస్తి కోసం పెంచి పెద్ద చేసిన తండ్రినే దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన మందస మండలం సిగలపుట్టుగ గ్రామంలో శుక్రవారం జరిగింది. మందస పోలీసుల వివరాల మేరకు.. మందస మండలం సిగలపుట్టుగ గ్రామానికి చెందిన బైపల్లి పకీరు(63) తన కుమారుడు భీమారావు కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. పకీరు భార్య కొన్నేళ్ల కిందట మృతిచెందింది. వీరికి కొబ్బరి, జీడి తోటలతో పాటు జీడి పరిశ్రమ ఉంది. అయితే, తండ్రీకుమారుడి మధ్య నిత్యం తగాదాలు జరుగుతుండేవి. దీంతో పకీరు మళ్లీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. శుక్రవారం రాత్రి మరో మహిళతో ఆయనకు వివాహం కావాల్సిఉంది. తండ్రి మళ్లీ పెళ్లి చేసుకుంటే ఆస్తి రెండు వాటాలవుతుందనే దుర్బుద్ధితో పకీరుతో కుమారుడు తగాదా పడ్డాడు. ఇద్దరిమధ్య జరిగిన ఘర్షణలో తండ్రి తలపై భీమారావు ఇనుప వస్తువుతో కొట్టాడు. దీంతో ఇంటిలోనే పకీరు కుప్పకూలిపోయాడు. చడీచప్పుడు లేకుండా తండ్రి మృతదేహాన్ని శ్మశాన వాటికకు తరలించి ఖననం చేసేందుకు భీమారావు సమాయాత్తమయ్యాడు. ఈ విషయం గ్రామంలోనే నివసిస్తున్న పకీరు మేనల్లుడు భుజంగరావుకు తెలిసి ఆరా తీశాడు. మృతిపై అనుమానంతో మందస పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు క్లూస్టీం, జాగిలాలతో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. భీమారావును అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మందస ఎస్ఐ కె.వెంకటేష్ తెలిపారు.