కన్నతండ్రిని కడతేర్చిన కుమారుడు

ABN , First Publish Date - 2021-02-28T06:33:53+05:30 IST

కన్నతండ్రిని దారుణంగా ఓ కసాయికొడుకు హత్య చేశాడు.

కన్నతండ్రిని కడతేర్చిన కుమారుడు
హత్యకు గురైన రాజన్న మృతదేహం

బండరాయితో మోది హత్య 

సోన్‌ ఎస్సైని సస్పెండ్‌ చేయాలని పోలీసులతో గ్రామస్థుల వాగ్వాదం

మృతదేహం పోస్టుమార్టం తీసుకెళ్లకుండా అడ్డుకున్న గ్రామస్థులు

సోన్‌, ఫిబ్రవరి 27 : కన్నతండ్రిని దారుణంగా ఓ కసాయికొడుకు హత్య చేశాడు. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం సోన్‌ మండలంలోని కూచన్‌ పెల్లి గ్రామానికి చెందిన సంగాని పెద్ద రాజన్న(65) అనే  వృద్ధుడు శుక్రవారం అర్ధరాత్రి దారుణహత్యకు గురి అయ్యాడు. కుటుంబ కలహాలతో నడిరోడ్డుపై తండ్రిని చిన్నకుమారుడు సంగానిరవి బండరాయితో మోది హత్య చేశాడు. గత ఆరు రోజుల క్రితం రవి గల్ఫ్‌ నుండి ఇంటికి వచ్చినట్లు గ్రామస్థులు తెలిపారు. కుటుంబ సభ్యులతో గొడవపడుతూ తన అన్న సంగానిరాజుపై శుక్రవారం మధ్యాహ్నం కొడవలితో దాడి చేయడంతో కుటుంబ సభ్యు లు సోన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రవిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. గాయాలపాలైన రాజు ప్రస్తుతం ఆస్పత్రిలో చావు బతుకుల్లో ఉండగానే నిందితు డిని సాయంత్రం పోలీసులు వదిలిపెట్టారు. అదే రాత్రి తిరిగి తన తండ్రితో గొడవపడి ఇంట్లో నుండి బయటకు తీసుకువచ్చి రోడ్డుపై బండరాయితో మోది దారుణంగా తండ్రిని హత్య చేశారు. సంఘటన స్థలాన్ని డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. సోన్‌ సీఐ జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 

కూచన్‌పెల్లి గ్రామంలో దారుణహత్యకు గురైన రాజన్న మృతదేహం పోస్టుమార్టంకు తీసుకెళ్లకుండా గ్రామస్థులు అడ్డుకున్నారు. రాజన్నను హత్య చేసిన కుమారుడు రవిని నిబంధనలకు విరుద్ధంగా అదే సాయంత్రం పోలీస్‌ స్టేషన్‌ నుండి వదిలిపెట్టడంతోనే రాజన్న హత్య జరి గిందని, దీనికి కారణమైన ఎస్సై సస్పెండ్‌ చేసే వరకు మృతదేహం తీసుకెళ్లేది లేదని పట్టుపట్టారు. ఈ సందర్భంగా పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. చివరకు డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి గ్రామస్థులతో మాట్లాడి తగ్గు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో గ్రామస్థులు శాంతించారు. 

Updated Date - 2021-02-28T06:33:53+05:30 IST