పరేషన్!
ABN , First Publish Date - 2020-03-31T09:27:53+05:30 IST
బియ్యం, కందిపప్పు ఉచిత పంపిణీలో ఈపోస్ కష్టాలు రెండో రోజైన సోమవారం కూడా కొనసాగాయి. ఉదయం 11 గంటల వరకే సరుకుల
రెండో రోజూ అదే తీరు
మొరాయించిన సర్వర్
పనిచేయని ఈ పోస్ యంత్రాలు
సరకుల పంపిణీలో తీవ్రజాప్యం
డిపోల వద్ద గంటల తరబడి పడిగాపులు
మండుటెండలో ఇబ్బందిపడిన జనం
(ఆంధ్రజ్యోతి-విశాఖపట్నం/చోడవరం)
బియ్యం, కందిపప్పు ఉచిత పంపిణీలో ఈపోస్ కష్టాలు రెండో రోజైన సోమవారం కూడా కొనసాగాయి. ఉదయం 11 గంటల వరకే సరుకుల పంపిణీ వుంటుందని ప్రభుత్వం ప్రకటించడంతో ఆదివారం సరుకులు తీసుకోనివారు ఉదయం ఆరు గంటలకే ఆయా రేషన్ డిపోలకు వచ్చారు. కానీ రెండు నుంచి మూడు గంటలపాటు సర్వర్ మొరాయించడంతో ఈ-పోస్ మిషన్లు పనిచేయలేదు. దీంతో సరుకులు పంపిణీలో జాప్యం ఏర్పడింది. జాయింట్ కలెక్టర్ శివశంకర్ నగరంలోని అక్కయ్యపాలెం, చినవాల్తేర్లో పలు డిపోలను సందర్శించారు. ఇదే సమయంలో సర్వర్ మొరాయించడంతో ఈ సమస్య ఆయన దృష్టికి వచ్చింది. వెంటనే రాష్ట్ర పౌరసరపరాల శాఖ అఽధికారులతో మాట్లాడారు. నగరంలోనే కాకుండా గ్రామీణ ప్రాంతంలో కూడా రేషన్ పంపిణీ మందకొడిగా సాగింది.
సాధారణంగా ఒక కార్డుకు సరుకుల పంపిణీ రెండు నుంచి మూడు నిమిషాలు పడుతుంది. కానీ సోమవారం ఉదయం తొమ్మిది గంటల వరకు ఒక్కో కార్డుకు ఐదు నిమిషాల సమయం పట్టింది. కాగా ఉదయం ఎనిమిది గంటలకే ఎండ తీవ్రంగా వుండడంతో రేషన్ డిపోల వద్ద క్యూలో నిల్చున్న కార్డుదారులు ఇబ్బందులు పడ్డారు.
గ్రామీణంలో బాగా ఆలస్యం
పారసరఫరాల శాఖ సర్వర్ మొరాయించడంతో గ్రామీణ ప్రాంతంలో రేషన్ పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. ఒక్కో కార్డుకు సరుకులు ఇవ్వడానికి 10 నుంచి 15 నిమిషాల సమయం పట్టింది. దీంతో గంటకు పది మంది మందికి మించి సరకులు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. డిపోల వద్ద కార్డుదారులు చాలాసేపు నిరీక్షించవలసిన పరిస్థితి ఏర్పడింది. పైన ఎండ మండుతుండడం, కింద కాళ్లు కాలుతుండడంతో గోనె సంచులను క్యూలైన్లో పెట్టి, సమీపంలోని చెట్ల నీడను ఆశ్రయించారు.
అనంతగిరి మండలంలో బొర్రా, అనంతగిరి, చిలకలగెడ్డ డిపోల్లో సోమవారం ఈ పోస్ యంత్రాలు మొరాయించాయి. పనిచేయడం మొదలుపెట్టిన తరువాత కూడా సర్వర్ నెమ్మదిగా వుండడంతో ఒక్కో కార్డుదారునికి సరుకులు ఇవ్వడానికి పది నిమిషాలపైగా పట్టింది. గొలుగొండ మండలం ఏఎల్ పురం, పాతకృష్ణాదేవిపేట, తదితర గ్రామాల్లో ఈ పోస్ యంత్రాలు సరిగా పనిచేయకపోవడంతో బియ్యం, కందిపప్పు పంపిణీలో జాప్యం ఏర్పడింది.