భద్రతామండలిని సంస్కరించాలి

ABN , First Publish Date - 2021-11-26T08:51:33+05:30 IST

ఐక్యరాజ్యసమితి భద్రతామండలి సహా ఇతర కీలక అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు అవసరమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.

భద్రతామండలిని సంస్కరించాలి

  • ఇతర అంతర్జాతీయ సంస్థల్లోనూ సంస్కరణలు అవసరం
  • శాంతి లేని చోట అభివృద్ధి సాధ్యం కాదు: వెంకయ్యనాయుడు 

న్యూఢిల్లీ, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): ఐక్యరాజ్యసమితి భద్రతామండలి సహా ఇతర కీలక అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు అవసరమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. నేటి సమకాలీన వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, నేటి అవసరాలకు అనుగుణంగా, భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు తగిన విధంగా సంస్కరణలు చే యాలన్నారు. 13వ ఏఎ్‌సఈఎం(ఆసియా ఐరోపా సదస్సు) తొలి ప్లీనరీ సెషన్‌ను గురువారం వర్చువల్‌గా వెంకయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ ప్రపంచం నేడు మరింత వేగంగా ముందుకు సాగుతోందని, ఈ నేపథ్యంలో అనేక ఆర్థిక, సాంకేతిక, భద్రతా సవాళ్లను ఎదుర్కొంటోందని చెప్పారు. ప్రస్తుత బహుపాక్షిక వ్యవస్థ దీనికి సమర్థవంతమైన పరిష్కారాన్ని అందించలేకపోతోందని తెలిపారు. భారతదేశం సంస్కరణాత్మక బహుపాక్షిక సూత్రాలను అనుసరిస్తూ ముందుకు సాగుతోందని తెలిపారు. శాంతి లేని చోట అభివృద్ధి సాధ్యం కాదని, అభివృద్ధి ముందుకు సాగని చోట ఆర్థిక పురోగతి క్షీణించి హింస, అస్థిరత లాంటివి చోటు చేసుకుంటాయని నొక్కి చెప్పారు. అందుకే ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించడానికి, జీవనోపాధిని, భద్రతను పెంపొందించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కరోనా మహమ్మారి కారణంగా ప్రతికూలంగా ప్రభావితమైన దేశాల పునరుద్ధరణలో దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచ స్థాయిలో నిరంతర అభద్రతకు కారణాలను విశ్లేషించుకుని, వాటిని తగ్గించడానికి ప్రయత్నాలు సాగించాలన్నారు. ప్రపంచ శాంతి, భద్రతలను కాపాడే దిశగా అంతర్జాతీయ వ్యవస్థ నిర్మాణంలో సంస్కరణల అవసరాన్ని నొక్కిచెప్పారు. కాగా, ఒకప్పటి సవాళ్లను ఎదుర్కొనేందుకు రూపొందించిన పాత వ్యవస్థలకు కాలం చెల్లిందని, వేగంగా ముందుకు సాగుతున్న ప్రపంచంలో అనేక ప్రస్తుత, భవిష్యత్‌ సవాళ్లను వీటి ద్వారా పరిష్కరించలేమన్నారు. 

Updated Date - 2021-11-26T08:51:33+05:30 IST