కుంభమేళాలో టెస్టుల కుంభకోణం

ABN , First Publish Date - 2021-06-16T06:42:57+05:30 IST

కుంభమేళాలో కొవిడ్‌ టెస్టుల పేరుతో భారీ కుంభకోణం చోటుచేసుకుంది. దీని విలువ రూ. కోట్లలో ఉంటుందని అంచనా. సెకండ్‌వేవ్‌కు కారణాల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు, రాజకీయ ర్యాలీలతో

కుంభమేళాలో టెస్టుల కుంభకోణం

నాలుగు లక్షల కొవిడ్‌ టెస్టుల్లో.. లక్ష ఉత్తివే

ఒకే కిట్‌ నంబర్‌తో.. 700 మందికి పరీక్షలు

ఒకే ఇంటి నంబరుపై 500 మందికి టెస్టులు

హరిద్వార్‌ రానివారి పేర్లను పేర్కొన్న ఏజెన్సీ

ఆరోగ్య శాఖ దర్యాప్తులో నిగ్గుతేలిన నిజాలు


హరిద్వార్‌, జూన్‌15: కుంభమేళాలో కొవిడ్‌ టెస్టుల పేరుతో భారీ కుంభకోణం చోటుచేసుకుంది. దీని విలువ రూ. కోట్లలో ఉంటుందని అంచనా. సెకండ్‌వేవ్‌కు కారణాల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు, రాజకీయ ర్యాలీలతో పాటు.. హరిద్వార్‌ కుంభమేళా కూడా ఒక కారణంగా విపక్షాలు ఆరోపించగా.. కేంద్రం, ఉత్తరాఖండ్‌ సర్కారు వాటిని కొట్టిపారేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్‌ 1 - 30 తేదీల మధ్య కుంభమేళా జరగ్గా.. అక్కడ కొవిడ్‌ టెస్టుల సంఖ్య పెంచాలని హైకోర్టు ఆదేశించింది. కనీసం రోజుకు 50 వేల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని సూచించింది. దీంతో ఉత్తరాఖండ్‌ సర్కారు.. 9 ఏజెన్సీలకు ఆ బాధ్యతను అప్పగించింది. ఈ ఏజెన్సీలన్నీ కలిపి.. కుంభమేళాలో మొత్తం 4 లక్షల పరీక్షలు నిర్వహించినట్లు బిల్లులు క్లెయిమ్‌ చేశాయి. ఏప్రిల్‌ చివరివారంలో.. పంజాబ్‌కు చెందిన ఓ వ్యక్తి మొబైల్‌ ఫోన్‌కు ‘‘హరిద్వార్‌లో మీరు కొవిడ్‌ టెస్టు చేయించుకున్నందుకు ధన్యవాదాలు.


మీ పరీక్ష రిపోర్టు నెగటివ్‌గా నిర్ధారణ అయ్యింది’’ అంటూ సందేశం వచ్చింది. దాంతో అతను తాను అసలు హరిద్వార్‌కే వెళ్లలేదని, తన మొబైల్‌కు సందేశం ఎలా వస్తుందంటూ ఐసీఎంఆర్‌కు ఫిర్యాదు చేశారు. 9 ఏజెన్సీల్లో ఒకదాని లెక్కలన్నీ తప్పుల తడక అని ఉత్తరాఖండ్‌ ఆరోగ్య శాఖ నిగ్గు తేల్చింది. ఆ ఏజెన్సీ లక్ష పరీక్షలు నిర్వహించినట్లు గుర్తించింది. ఏప్రిల్‌లో హరిద్వార్‌లో పాజిటివిటీ రేటు 10ు ఉండగా.. ఆ ఏజెన్సీ జరిపిన పరీక్షల్లో 177(0.18ు) మందికే పాజిటివ్‌ అని పేర్కొంది. దాంతో.. మరింత లోతుగా దర్యాప్తు చేశారు. ఆ ఏజెన్సీ చేపట్టిన టెస్టుల జాబితాను పరిశీలించిన అధికారులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ప్రతి ర్యాపిడ్‌ యాంటీజెన్‌ కిట్‌కు ఒక విశిష్ట సంఖ్య ఉంటుంది. అయితే.. ఈ ఏజెన్సీ ఒకే యాంటీజెన్‌ కిట్‌ నంబరుతో 700 మందికి పరీక్షలు చేసినట్లు రిజిస్టర్‌లో పేర్కొంది. అంతేకాదు.. హరిద్వార్‌లోని ఇంటినంబరు-5కు చెందిన 500 మందికి పరీక్షలు చేసినట్లు వెల్లడించింది. ఒకే మొబైల్‌ నంబరుపై 50 మందికి పరీక్షలు నిర్వహించింది. ఈ 50 మంది కూడా వేర్వేరు రాష్ట్రాలకు చెందిన వారు కావడం గమనార్హం..!


ఆయా రాష్ట్రాల్లోని చిరునామాలను సైతం.. ‘‘ఇంటినంబరు 40, ముంబై.. ఇంటినంబరు 10, అలీగఢ్‌..’’ అంటూ పొంతన లేని చిరునామాలను పేర్కొంది. ఇక స్వాబ్‌ నమూనాల సేకరణకు 200 మంది వలంటీర్లను నియమించినట్లు పేర్కొన్న సదరు ఏజెన్సీ.. వారి పేర్లు, మొబైల్‌ నంబర్లను ప్రభుత్వానికి అందజేసింది. దర్యాప్తు బృందం వారికి ఫోన్లు చేయగా.. సగం మంది రాజస్థాన్‌కు చెందిన వారని, వారు అసలు హరిద్వార్‌కే రానట్లు తేలింది. ఈ ఏజెన్సీ బండారం బయటపడడంతో.. మిగతా 8 ఏజెన్సీలు/ల్యాబ్‌ల చిట్టానూ అధికారులు పరిశీలిస్తున్నారు. దీనిపై హరిద్వార్‌ జిల్లా కలెక్టర్‌ తదుపరి విచారణ జరుపుతున్నారని ఆరోగ్య శాఖ కార్యదర్శి అమిత్‌ నేగి తెలిపా రు. ‘‘సదరు ఏజెన్సీకి ఇంకా కొన్ని బిల్లులు పెండింగ్‌లో ఉన్నా యి. ఒక్కో యాంటీజెన్‌ పరీక్షకు రూ.350 చెల్లించేలా ఒప్పం దం జరిగింది. నిజాలు నిగ్గుతేలేదాకా బిల్లులకు నిధుల విడుదలను నిలిపివేస్తున్నాం’’ అని కలెక్టర్‌ రవిశంకర్‌ తెలిపారు. 

Updated Date - 2021-06-16T06:42:57+05:30 IST