నిమజ్జనంలో నిబంధనలు పాటించాలి
ABN , First Publish Date - 2021-09-19T04:05:09+05:30 IST
వినాయక ప్రతిమలను నిమజ్జనం చేసేరోజు ప్రతీఒక్కరు నిబంధనలు పాటించాలని మెదక్ మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్ అన్నారు.
మెదక్ మున్సిపాలిటీ, సెప్టెంబరు 18: వినాయక ప్రతిమలను నిమజ్జనం చేసేరోజు ప్రతీఒక్కరు నిబంధనలు పాటించాలని మెదక్ మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్ అన్నారు. శనివారం మున్సిపల్ కార్యాలయంలో వినాయక మండపాల నిర్వాహకులతో నిమజ్జన సన్నాహక ఏర్పాట్లపై సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ విగ్రహాలను కొంటూర్ చెరువు వద్ద నిమజ్జనానికి తీసుకెళ్లాలని, మిగతా విగ్రహాలను పిట్లంచెరువు, గోసముద్రం, ఎంఎన్ కెనాల్ వద్ద నిమజ్జనం చేయాల్సిందిగా కోరారు.
సంగారెడ్డి టౌన్: గణే్ష్ నిమజ్జనోత్సవాన్ని ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కోరారు. వినాయక నవరాత్రోత్సవాలు పూర్తి చేసుకుని ఆదివారం జరుగనున్న గణేష్ విగ్రహాల నిమజ్జనం జరుగనున్న నేపథ్యంలో సంగారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ బొంగుల విజయలక్ష్మితో కలిసి సంగారెడ్డిలోని వినాయక సాగర్ వద్ద ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. కాగా సంగారెడ్డిలోని 16వ వార్డు పరిధిలో ఉన్న ఫల పరిశోధన కేంద్రం (ఎఫ్ఆర్ఎస్) వద్ద ఏర్పాటు చేయనున్న కొండాలక్ష్మణ్ బాపూజీ విగ్రహ ప్రతిష్టాపన కోసం మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ భూమి పూజ చేశారు.