వరి పంటనే మాకు అనుకూలం
ABN , First Publish Date - 2021-12-01T05:08:55+05:30 IST
ప్రభుత్వం చెప్పినట్టు ఆరుతడి పంటలు వేయడం మాకు సాధ్యం కాదని, మా భూములు వరిపంటకు అనుకూలంగా ఉన్నాయని హత్నూర మండలంలోని కాసాల, రెడ్డిఖానాపూర్ రైతులు తేల్చిచెప్పారు.
తేల్చిచెప్పిన పలు గ్రామాల రైతులు
హత్నూర, నవంబరు 30 : ప్రభుత్వం చెప్పినట్టు ఆరుతడి పంటలు వేయడం మాకు సాధ్యం కాదని, మా భూములు వరిపంటకు అనుకూలంగా ఉన్నాయని హత్నూర మండలంలోని కాసాల, రెడ్డిఖానాపూర్ రైతులు తేల్చిచెప్పారు. మంగళవారం ఆయా గ్రామాల్లో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించారు. నిర్వహించారు. మా పొలాలు వరి పంటకు అనుకూలంగా ఉన్నాయని, ప్రత్యామ్నాయ పంటలు వేయలేమని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ సదస్సులో బీటీఎం రవీందర్ రాథోడ్, వ్యవసాయ శాఖ విస్తీర్ణ అధికారి ప్రేమ్రాజ్, రెండు గ్రామాల రైతులు పాల్గొన్నారు.
జిన్నారం: వరికి బదులు ప్రత్యామ్నాయ పంటల సాగుకోసం అధికారులు నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వ తీరుపై రైతులు తీవ్రంగా మండిపడ్డారు. మంగళవారం జిన్నారం మండలం ఊట్ల గ్రామంలో ఏఈవో యోగేశ్వర్రెడ్డి సమావేశాన్ని నిర్వహించేందుకు వచ్చారు. వరిపంట వేయవద్దని ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని మండిపడ్డారు. ప్రత్యామ్నాయ పంటల సాగుకు తమ గ్రామం అనుకూలం కాదని, కూరగాయలు సాగుచేస్తే కోతుల బెడద, మార్కెటింగ్ సమస్యలు ఉన్నాయని తెలిపారు. భారీగా ప్రాజెక్టులు కట్టి వరిపంట వద్దని ధాన్యం కొనుగోలు చేయమన్న ప్రభుత్వ తీరుకు నిరసనగా రైతులు సమావేశంలో పాల్గొనలేదు. దీంతో వ్యవసాయ అధికారులు వెనుదిరిగారు.
గుమ్మడిదల: యాసంగిలో వరిపంట వద్దని సీఎం కేసీఆర్ చెప్పడం ఎంతో బాధ కలిగిస్తున్నదని గుమ్మడిదల గ్రామానికి చెందిన పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం గుమ్మడిదల మండలంలోని కోరుపతి రమేష్ పొలంలో బోరుబావుల నుంచి పైకి పొంగి పొలంలో పారుతున్న నీటిని విలేకరులకు చూపిస్తూ, ప్రభుత్వం వరిపంటపై ఆంక్షలు విధించడంపై వాపోయారు. ఇలా నీల్లు పారడం వల్ల వరిపంట తప్ప ఏ పంట పండే పరిస్థితి లేదని, వరి వద్దంటే ఎలా బతకాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వెంటనే యాసంగిపై వరి ఆంక్షలు ఎత్తేయాలన్నారు.