పేగుబంధాన్ని చిదిమేసిన పరువు

ABN , First Publish Date - 2021-12-04T08:03:01+05:30 IST

పదిహేడేళ్ల బాలిక నిద్రిస్తుండగా కన్నతల్లి, ఆమె ఛాతీమీద కూర్చుని గొంతు నులిమింది. అమ్మమ్మనేమో ఆ బాలిక ముఖంపై దిండును గట్టిగా అదిమిపట్టింది..

పేగుబంధాన్ని చిదిమేసిన పరువు

  • 17 ఏళ్ల బాలికను గొంతు నులిమి చంపిన తల్లి.. అమ్మమ్మ సహకారం
  • వేరే కులం అబ్బాయితో బాలిక ప్రేమ 
  • బాలిక ఎస్సీ, యువకుడు ఎస్టీ
  • ఊర్లో తమ పరువు పోతోందన్న ఆగ్రహంతోనే దారుణం
  • వరంగల్‌ జిల్లాలో ఘటన
  • పోలీసుల ఎదుట లొంగుబాటు


హనుమకొండ క్రైం, డిసెంబరు 3: పదిహేడేళ్ల బాలిక నిద్రిస్తుండగా కన్నతల్లి, ఆమె ఛాతీమీద కూర్చుని గొంతు నులిమింది. అమ్మమ్మనేమో ఆ బాలిక ముఖంపై దిండును గట్టిగా అదిమిపట్టింది! పేగుబంధం అనే కనికరం కూడా లేకుండా ఇద్దరూ కలిసి బాలికను దారుణంగా హత్యచేశారు. తాము తగదని చెబుతున్నా వేరే కులం అబ్బాయితో బాలిక ప్రేమ పేరుతో చనువుగా ఉంటోందని.. ఆ కారణంగా ఊర్లో తమ పరువు పోతోందనే ఆగ్రహంతో వారు ఇంతటి దారుణానికి ఒడిగట్టారు. వరంగల్‌లో జిల్లాలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. తమ నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నట్లుగా తప్పుదోవ పట్టించి.. 15 రోజుల పాటు నెట్టుకొచ్చిన నిందితులు, తాము చేసిన ఘోరం బయటపడక తప్పదనే నిర్ధారణకు వచ్చి తమతంట తాముగానే నేరం ఒప్పుకొన్నారు. ఈ కేసు వివరాలను శుక్రవారం వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ కార్యాయంలో ఈస్ట్‌జోన్‌ డీసీపీ వెంకటలక్ష్మి వివరించారు. పర్వతగిరి మండల కేంద్రంలో ఉంటున్న ఎస్సీ (మాల) వర్గానికి చెందిన ఉబ్బని సమ్మక్కకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు వివాహమవ్వగా మరో కుమార్తె అంజలి(17) పదో తరగతి చదువుతోంది. సమ్మక్త భర్త రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. ఇంట్లో సమ్మక్క, అంజలితో పాటు సమ్మక్క తల్లి యాకమ్మ ఉంటోంది.


 అంజలికి అదే గ్రామస్థుడు, ఎస్టీ(ఎరుకల) కులానికి చెందిన యువకుడితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇద్దరూ సన్నిహితంగా ఉండేవారు. విషయం తెలిసి అంజలిని సమ్మక్క, యాకమ్మ మందలించారు. అయినా అంజలి వినిపించుకోలేదు. కూతురి తీరుతో ఊర్లో తమ పరువు పోతోందని సమ్మక్క భావించింది. యాకమ్మతో కలిసి కూతురిని హత్య చేసేందుకు పథకం వేసింది. తొలుత.. ఇంట్లో ఉరివేసి చంపాలని అనుకున్నారు. విషయం బయటకు తెలిస్తే దొరికిపోతామని విరమించుకున్నారు. నవంబరు 19న రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న అంజలిని ఇద్దరూ కలిసి హత్య చేశారు. తెల్లవారేవరకు మృతదేహం పక్కనే నిద్రించారు. ఉదయం ఇద్దరు ఇంట్లో నుంచి బయటకొచ్చి అంజలి లేవడం లేదని ఏడుపులు పెడబొబ్బలు పెట్టారు. రాత్రి గొడవ జరిగిందని, నిద్రమాత్రలు వేసుకుంటానని బెదిరించిందనీ చెప్పారు. దీంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. మృతురాలి గొంతుపై గోళ్లు గీసుకుపోయినట్లు గాట్లు ఉండటం, ముక్కు నుంచి రక్తం కారడంతో పోలీసులు అనుమానించారు. అయితే సమ్మక్క, యాకమ్మను ప్రశ్నించకుండా పోస్టుమార్టం, ఫోరెన్సిక్‌ నివేదిక వచ్చేదాకా వేచి చూశారు. పోస్టుమార్టం రిపోర్టులో అనుమానాస్పద మృతిగా వచ్చింది. ఫోరెన్సిక్‌ రిపోర్టును తెప్పించుకునే పనిలో పోలీసులు ఉండగానే తాము పట్టుబడటం తథ్యం అని సమ్మక్క, యాకమ్మ అనుకున్నారు. శుక్రవారం గ్రామ పెద్దమనిషి వద్దకు వెళ్లి తమ బిడ్డను తామే చంపామని, తమను పోలీసుల వద్దకు తీసుకువెళ్లాలని కోరారు. పెద్దమనుషుల సాయంతో ఇద్దరు కలిసి పర్వతగిరి పోలీసుల ఎదుట లొంగిపోయారు. వారిని అరెస్టు చేసి, హత్యానేరం కింద  కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Updated Date - 2021-12-04T08:03:01+05:30 IST