ఆదరణ అపూర్వం

ABN , First Publish Date - 2021-12-28T08:05:02+05:30 IST

‘‘మీ ప్రేమాభిమానాలకు వందనం, అభివందనం. తెలుగు ప్రజల ఆశీర్వాద బలంతోనే ఈ స్థాయికి వచ్చాను. అబ్బాయ్‌ రమణా..

ఆదరణ అపూర్వం

  • మీ ప్రేమాభిమానాలకు అభివందనం.. 
  • నేను, నా కుటుంబ సభ్యులు ఎప్పటికీ మరువలేం
  • తెలుగు ప్రజల ఆశీర్వాద బలంతోనే ఈ స్థాయికి 
  • మీ నమ్మకాన్ని వమ్ముచేయనని మాటిస్తున్నా
  • స్వగ్రామంలో ‘అబ్బాయ్‌ రమణా’ అంటూ పెద్దలు పలకరించిన వైనం పులకరింపజేసింది
  • సమయాభావం వల్ల అందరినీ కలవలేకపోయా
  • మరోసారి అవకాశం వస్తుందని ఆశిస్తున్నా
  • రాష్ట్ర పర్యటనపై సీజేఐ జస్టిస్‌ రమణ భావోద్వేగ లేఖ 


అమరావతి, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ‘‘మీ ప్రేమాభిమానాలకు వందనం, అభివందనం. తెలుగు ప్రజల ఆశీర్వాద బలంతోనే ఈ స్థాయికి వచ్చాను. అబ్బాయ్‌ రమణా.. అని స్వగ్రామంలో పెద్దలు పలకరించిన వైనం నన్ను పులకరింపజేసింది. ప్రజలు, ప్రభుత్వం, రైతులు, న్యాయవాదులు, స్వగ్రామం చూపించిన ఆదరణ అపూర్వం. సమయాభావం వల్ల అందరినీ కలవలేకపోయా. మరోసారి అందరినీ కలిసే అవకాశం వస్తుందని ఆశిస్తున్నాను’’ అని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ పేర్కొన్నారు. రాష్ట్రంలో నాలుగు రోజుల పర్యటన సందర్భంగా తనపై అభిమానం చూపించి, ఆశీర్వాదాలు ఇచ్చి, ఏర్పాట్లు చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సోమవారం భావోద్వేగ లేఖ విడుదల చేశారు. లేఖలోని సారాంశం ఆయన మాటల్లోనే... 


చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయ్‌.. 

ఎప్పటి నుంచో ఒకసారి మా ఊరు పొన్నవరం వెళ్లిరావాలని అనుకుంటున్నా. సుప్రీం కోర్టుకు శీతాకాలం సెలవులు రావడంతో అవకాశం లభించింది. భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి ఈ నెల 24న ఎంతో ఉత్సుకతతో స్వగ్రామానికి సకుటుంబ సమేతంగా బయలుదేరాను. గరికపాడు దగ్గర ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కాలుమోపింది మొదలు.. ఆంధ్రప్రజలు అసంఖ్యాకంగా బారులు తీరి, స్వాగత వచనాలతో, నినాదాలతో, పూలవానతో, అపారమైన ప్రేమాభిమానాలతో ముంచెత్తిన తీరు నేను, నా కుటుంబ సభ్యులు ఎప్పటికీ మరువలేం. బంధుత్వాల కంటే మిత్ర బృందానికే పెద్ద పీట వేసే పొన్నవరం ఊరు ఊరంతా తరలివచ్చి.. నన్ను, నా కుటుంబ సభ్యులను ఎడ్ల బండి ఎక్కించి, పొలిమేరల నుంచి ఊరేగింపుగా తోడ్కొని పోయిన వైనం నన్ను కదిలించింది. మూలాలు మరువరాదని బలంగా విశ్వసించే నేను మా ఇద్దరు కుమార్తెలకు మరోసారి, ఇద్దరు అల్లుళ్లు, ఇద్దరు చిన్నారి మనుమరాళ్లకు తొలిసారి నా ఊరు చూపించడం ఎంతో సంతృప్తినిచ్చింది. పొన్నవరం వీధుల్లో నడుస్తుంటే చిన్ననాటి జ్ఞాపకాలు తరుముకొచ్చాయి. ఆప్తులు ఎందరో చాలాకాలం తర్వాత కలిశారు. భావోద్వేగం కట్టలు తెంచుకుంది. ‘అబ్బాయ్‌ రమణా’ అని ఊళ్లో పెద్దలు పలకరించిన వైనం నన్ను పులకరింపజేసింది. అన్ని గౌరవార్థకాలు ఆ ఆశీర్వచన భరిత పలకరింపు ముందు దిగదుడుపే.


అందరికీ ధన్యవాదాలు

మా ఊరి ప్రయాణ వార్త తెలియగానే ఎన్నో ఆహ్వానాలందాయి. అందులో కొన్ని మాత్రమే ఆమోదించగలిగాను. గౌరవనీయులు గవర్నర్‌, ముఖ్యమంత్రి.. భారత ప్రధాన న్యాయమూర్తి హోదాలో రాజధాని ప్రాంతంలో నా తొలి పర్యటన పురస్కరించుకుని ఆతిథ్యమిచ్చారు వారికి, రాష్ట్ర ప్రభుత్వానికి, తేనీటి విందుకు హాజరైన పెద్దలు, ప్రముఖులు, మంత్రులు, అధికారులందరికీ కృతజ్ఞతలు. వివిధ రంగాలకు చెందినవారు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ, సామాజిక పక్షాల ప్రతినిధులు ఎందరో నన్ను పలకరించేందుకు వచ్చారు. అందరికీ ధన్యవాదాలు. న్యాయవాద వృత్తితో నాకు నడకనేర్పిన బెజవాడ బార్‌ అసోసియేషన్‌, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌, ఆంధ్రప్రదేశ్‌ బార్‌ కౌన్సిల్‌, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఉద్యోగుల సంఘం, రోటరీ క్లబ్‌ ఆఫ్‌ విజయవాడ అతి స్వల్ప వ్యవధిలో, అసాధారణమైన ఏర్పాట్లతో నన్నూ, నా సతీమణి శివమాలను సత్కారాలతో ముంచెత్తాయి. కొందరు పొరుగు రాష్ట్రం తెలంగాణ నుంచి తరలివచ్చి ఈ కార్యక్ర మాల్లో పాల్గొన్నారు. 


ఇందుకోసం అహర్నిశలు శ్రమించిన ఈ సంస్థలకు, వ్యక్తులకు పేరుపేరునా కృతజ్ఞతలు. శ్రీ లావు వెంకటేశ్వర్లు స్మారక ఉపన్యాసమివ్వడానికి నన్ను ఎంపిక చేసిన సిద్ధార్థ న్యాయ కళాశాలకు, కార్యక్రమానికి హాజరైన వారందరికీ ధన్యవాదాలు. ఈ పర్యటనలో నా వెంట ఉన్న సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, రెండు తెలుగు రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తుల పట్ల మీరు చూపిన గౌరవం, అభిమానం శ్లాఘనీయం. న్యాయ వ్యవస్థ పట్ల, న్యాయమూర్తుల పట్ల తెలుగు ప్రజలు చూపిన గౌరవం చూసి వారెంతో సంతోషించారు. నా నుంచి ఏమీ ఆశించకుండా సొంత పనులన్నీ మానుకుని, నేను ప్రయాణించిన మార్గంలో గంటల తరబడి వేచి ఉండి, అడుగడుగునా దీవించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ఽనమస్సులు. మీరు చూపిన అభిమానాన్ని, నమ్మకాన్ని వమ్ము చేయనని మాటిస్తున్నా. 


మీ ఆశీర్వాదాలు ఇలాగే కొనసాగాలి.. 

భవ్య దర్శనభాగ్యం కల్పించిన విజయవాడ శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వారి దేవస్థానం, పొన్నూరు శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం, చందోలు శ్రీ బగళాముఖి అమ్మవారి దేవస్థానం, ఇంకా మా ఊరి ఆలయాల పాలక మండళ్లకు హృదయపూర్వక ధన్యవాదాలు. క్రిస్మస్‌రోజు ఆశీర్వాదాలు అందించిన క్రైస్తవ మత పెద్దలకు కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్‌లో అడుగు పెట్టినప్పటి నుంచి మా బాగోగులు చూసుకున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రోటోకాల్‌ సిబ్బందికి, పోలీస్‌ సిబ్బందికి, రాజ్‌భవన్‌ అధికారులకు, యావత్‌ అధికార యంత్రాంగానికి మా అందరి తరఫున  కృతజ్ఞతలు. మా పర్యటన సాఫీగా, సౌకర్యవంతంగా సాగేందుకు ప్రత్యేక శ్రద్ధచూపిన ముఖ్యమంత్రి, మంత్రులకు, రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. పాత్రికేయులకు ప్రత్యేక ధన్యవాదాలు. 24వ తేదీన హైదరాబాద్‌లో బయల్దేరింది మొదలు ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దు వరకు, తిరిగి సోమవారం ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దు నుంచి హైదరాబాద్‌ చేరేవరకు సకల సదుపాయాలు కల్పించిన తెలంగాణ పోలీస్‌ సిబ్బందికి, తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞత లు. దారిలో మాకు ఎందరో స్వాగతం పలికారు. వారందరికీ అభివందనాలు. సమయాభావం వల్ల ఎందరినో కలవడం కుదరలేదు. మరోసారి అందర్నీ కలిసే అవకాశం త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నా. తెలుగు ప్రజల ఆశీర్వాద బలమే నన్నీస్థాయికి చేర్చింది. మీ ఆశీర్వాదాలు ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ... మీ నూతలపాటి వెంకటరమణ అంటూ లేఖను ముగించారు.

Updated Date - 2021-12-28T08:05:02+05:30 IST