మా బాధలు కనిపించలేదా విజయమ్మా?

ABN , First Publish Date - 2021-04-17T09:50:52+05:30 IST

షర్మిలకు చిన్న గాయమైందని అల్లాడిపోయిన వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ.. అమరావతి రైతులను ఆమె కుమారుడు, సీఎం జగన్‌ ఎన్నో బాధలు పెడుతున్నా,

మా బాధలు కనిపించలేదా విజయమ్మా?

షర్మిలకు చిన్న గాయమైతే అల్లాడారే

వైసీపీ గౌరవాధ్యక్షురాలికి రాజధాని రైతుల ప్రశ్న


తుళ్ళూరు, ఏప్రిల్‌ 16: షర్మిలకు చిన్న గాయమైందని అల్లాడిపోయిన వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ.. అమరావతి రైతులను ఆమె కుమారుడు, సీఎం జగన్‌ ఎన్నో బాధలు పెడుతున్నా, వేధింపులకు గురిచేస్తున్నా ఎందుకు స్పందించడం లేదని రాజధాని మహిళలు, రైతులు నిలదీశారు. అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని కోరుతూ రైతులు చేస్తున్న ఉద్యమం శుక్రవారం నాటికి 486వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రైతులు, మహిళలు మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ఇంటింటికీ తిరిగి జగన్‌ను గెలిపించాలని ప్రచారం చేసిన విజయమ్మ అమరావతి రైతుల బాధలు తెలిసి కూడా ఎందుకు స్పందించటం లేదని ప్రశ్నించారు. అమరావతిని ఆట బొమ్మను చేద్దామనే కుట్రకు చరమగీతం పాడాలనే ఉద్యమం చేస్తున్నామన్నారు.


అధికారంవస్తే మాట తప్పుతారా అని నిలదీశారు. పాలకులు  మారినప్పుడల్లా రాజధాని మార్చుకుంటూ పోతే 5కోట్ల మంది ఆంధ్రులకు విలువ ఉంటుందా అని ఆగ్రహం వ్యక్తంచేశారు. భూములు ఇచ్చిన పాపానికి 486 రోజుల నుంచి రోడ్ల మీద కొచ్చి ధర్నాలు చేయాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. కాగా, అమరావతి వెలుగు కార్యక్రమం కింద శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో ధర్నా శిబిరాలు, రైతుల ఇళ్ల వద్ద దీపాలు వెలిగించి నిరసన వ్యక్తం చేశారు.

Updated Date - 2021-04-17T09:50:52+05:30 IST