కేంద్ర ప్రభుత్వం వల్లే పసుపు ధర పెరిగింది
ABN , First Publish Date - 2021-03-06T08:43:01+05:30 IST
కేంద్ర ప్రభుత్వం పసుపు దిగుమతులను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం వల్లే పసుపు ధర పెరిగిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు.
- ఇందూరులో ప్రాసెసింగ్ యూనిట్లు పెడతాం
- నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్
- పాలనలో కేసీఆర్, కేటీఆర్ విఫలం: వివేక్
నిజామాబాద్(ఖిల్లా)/హైదరాబాద్/సిటీ, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం పసుపు దిగుమతులను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం వల్లే పసుపు ధర పెరిగిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. శుక్రవారం నిజామాబాద్లోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ను ఆయన సందర్శించారు. కొత్త వ్యవసాయ చట్టాల వల్ల రాబోయే రోజుల్లో పసుపు ధర మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో రైతులకు మౌలిక వసతులను కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. నిజామాబాద్లో పసుపు ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కాగా, కేసీఆర్, కేటీఆర్లు పరిపాలనలో విఫలమయ్యారని మాజీ ఎంపీ వివేక్ విమర్శించారు. ఈజ్ ఆఫ్ లివింగ్ సూచీలో గతంలో 4వ స్థానంలో నిలిచిన హైదరాబాద్ ప్రస్తుతం 24వ స్థానానికి దిగజారిందని పేర్కొన్నారు. ముద్ర లోన్లు రావడంలేదని మంత్రి కేటీఆర్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
ఆస్తి పన్ను రద్దు చేయండి..
కొవిడ్ ప్రభావంతో వ్యాపారాలు జరగని దృష్ట్యా 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను మాఫీ చేయాలని బీజేపీ కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ కమిషనర్కు వినతిపత్రం అందించారు. ఇప్పటికే ఎవరైనా పన్ను చెల్లిస్తే 2021-22 సంవత్సరంలో మినహాయింపు ఇవ్వాలన్నారు