ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండండి

ABN , First Publish Date - 2022-05-21T07:12:18+05:30 IST

‘వచ్చే ఎన్నికల్లో గెలిచేది మనమే. అధికారంలోకి వచ్చేది మనమే. ఎన్నికలు ఎప్పుడొచ్చినా నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి’ అని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ సీఎం చంద్రబాబునాయుడు సూచించారు.

ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండండి

అధికారం మనదే

కష్టకాలంలో పనిచేసిన వారికే పెద్ద పీట

కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటా

టీడీపీని అఖండ మెజార్టీతో గెలిపించాలి 

జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు 


‘వచ్చే ఎన్నికల్లో గెలిచేది మనమే. అధికారంలోకి వచ్చేది మనమే. ఎన్నికలు ఎప్పుడొచ్చినా నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి’ అని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ సీఎం చంద్రబాబునాయుడు సూచించారు. బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా జిల్లాకు వచ్చిన ఆయన, నగరంలోని ఓ ఫంక్షన హాల్‌లో పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో శుక్రవారం ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అనంతపురం జిల్లా టీడీపీకి కంచుకోట అని చంద్రబాబు అన్నారు. నందమూరి తారకరామారావుకు సీమ జిల్లాలు, అందులోను అనంత అంటే మమకారం ఎక్కువని అన్నారు. అందుకే తన సొంత నియోజకవర్గాన్ని వదులుకొని, హిందూపురం నుంచి పోటీ చేశారని అన్నారు. ఎన్టీఆర్‌ హయాం నుంచి ఇప్పటి దాకా టీడీపీని అనంత ప్రజలు ఆదరిస్తున్నారని అన్నారు. 2014 ఎన్నికల్లో 12 ఎమ్మెల్యేలు, రెండు ఎంపీ స్థానాలను ఇచ్చిన జిల్లా అనంత అని  గుర్తు చేశారు.

- అనంతపురం  అర్బన 



జెండా మోసినోళ్లకు అండ

పార్టీ జెండాని 40 ఏళ్లుగా మోసిన కార్యకర్తలకు తాను రుణపడి ఉన్నానని చంద్రబాబు అన్నారు. కార్యకర్తలకు టీడీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. ఎక్కడైనా టీడీపీ కార్యకర్తలు మరణిస్తే, వారి పిల్లలను ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ ద్వారా చదివించే బాధ్యత తీసుకుంటున్నామని అన్నారు. పార్టీ సభ్యత్వం ఉన్న కార్యకర్తలకు బీమా చేయిస్తున్నామని అన్నారు. ఇప్పటి దాకా బాధిత కార్యకర్తల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున రూ.100 కోట్లకుపైగా బీమా పరిహారం ఇప్పించామని గుర్తు చేశారు. నాయకులైతే పదవులు వస్తాయని, కానీ కార్యకర్తలు ఏ పదవులు ఆశించకుండా నిస్వార్థంగా పార్టీ కోసం పనిచేస్తున్నారని అన్నారు. కార్యకర్తలే పార్టీకి కొండంత అండ, సంపద అని కొనియాడారు. కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసే వారికే ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ప్రజలతో మమేకం కండి, వారితో చైతన్యం తీసుకొచ్చి ఓట్లు పడేలా చేయండి, అలాంటి నాయకులకే అన్ని రకాలుగా ప్రాధాన్యం ఇస్తామని అన్నారు.


పెద్ద కుటుంబం..

టీడీపీ.. 60 లక్షల మంది సభ్యత్వం కలిగిన పెద్ద కుటుంబమని, ఎనఆర్‌ఐలు, విదేశాల్లోనూ టీడీపీ సభ్యత్వం తీసుకుంటున్నారని చంద్రబాబు అన్నారు. పార్టీ సభ్యత్వాన్ని అందరూ తీసుకొని సమాజాభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. 2019లో టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే ఏపీని దేశంలోనే నెంబర్‌ వనగా తీర్చిదిద్దేవారమని అన్నారు. టీడీపీ ఎన్నో సంక్షోభాలను అవలీలగా ఎదుర్కొందని గుర్తు చేశారు. 2024, అంతకు ముందు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీడీపీ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని సూచించారు. 


త్వరలో అభ్యర్థుల జాబితా..

ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను త్వరలోనే ప్రకటిస్తానని చంద్రబాబు అన్నారు. సమర్థులైన వారి జాబితాను తయారు చేసే పనిలోనే తాను ఉన్నానని అన్నారు. ఎన్నికల్లో యువతకు 40 శాతం సీట్లు కేటాయిస్తామని తెలిపారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే సమర్థులకు అవకాశం ఇస్తానని అన్నారు. 


జే బ్రాండ్‌ మద్యం

జే మద్యం బ్రాండ్లను అధిక ధరలకు విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతు న్నారని చంద్రబాబు విమర్శించారు. అప్పుడున్న కింగ్‌ఫిషర్‌ బీరు ఉందా..? అని కార ్యకర్తలను బాబు అడిగారు. అందుకు వారు ‘బూం బూం’ ఉందని సమాధానం చెప్పారు. ప్రత్యేక హోదా తెప్పించలేరు కానీ స్పెషల్‌ స్టేటస్‌ పేరుతో మద్యం బాటిల్‌ మాత్రం తెచ్చారని అన్నారు. ఏపీలో కంటే కర్ణాటకలో పెట్రోలు లీటరుపై రూ.15, డీజిల్‌ రూ.10 తక్కువ అని అన్నారు. అందుకే అక్కడికి వెళ్లి మనవాళ్లు పెట్రోలు ఫుల్‌ ట్యాంక్‌ చేయించుకుంటున్నారని, అక్కడే క్వార్టర్‌ తాగి వస్తున్నారని అన్నారు. ఇంత అవివేకమైన సీఎం ప్రపంచంలోనే ఎవరూ లేరని విమర్శించారు.


సమావేశంలో ముఖ్యనాయకులు

విస్తృతస్థాయి సమావేశంలో మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, పల్లెరఘునాథ్‌రెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా ఇనచార్జి బీటీ నాయుడు, పీఏసీ చైర్మన పయ్యావుల కేశవ్‌, మాజీ ఎంపీలు జేసీ దివాకర్‌రెడ్డి, నిమ్మల కిష్టప్ప, మాజీ ఎమ్మెల్యేలు బీకే పార్థసారఽథి, జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఉన్నం హనుమంతరాయచౌదరి, ఈరన్న, జితేంద్రగౌడ్‌, కందికుంట వెంకటప్రసాద్‌, నియోజకవర్గ ఇనచార్జిలు పరిటాల శ్రీరామ్‌, ఉమామహేశ్వరనాయుడు, బండారు శ్రావణిశ్రీ, శింగనమల ద్విసభ్య కమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి, ఆలం నరసానాయుడు, రాష్ట్ర కార్యదర్శులు తలారి ఆదినారాయణ, వెంకటశివుడు యాదవ్‌, దేవళ్ల మురళి, జెఎల్‌ మురళి, బుగ్గయ్య చౌదరి, ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్‌ రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌ చౌదరి, మాజీ మేయర్‌ స్వరూప, మాజీ డిప్యూటీ మేయర్‌ గంపన్న, రాష్ట్ర మాంసాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన ప్రకా్‌షనాయుడు, జిల్లా అధికార ప్రతినిధి సరిపూటి రమణ, జిల్లా ఉపాధ్యక్షుడు డిష్‌ నాగరాజు, జిల్లా ప్రచార కార్యదర్శి బీవీ వెంకటరాముడు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన గౌస్‌ మొహిద్దీన, లీగల్‌ సెల్‌ రాష్ట్ర నాయకులు ఆదెన్న, బీసీ సెల్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగరాజు, నాయకులు నెట్టెం బాలకృష్ణ,  కూచి హరి, రాయల్‌ మురళీ మోహన, గుడిపూటి నారాయణస్వామి, సయ్యద్‌ సైఫుద్దీన, వడ్డే వెంకటేష్‌, ఫిరోజ్‌ అహ్మద్‌ తదితరులు పాల్గొన్నారు. 




  లోన్లన్నీ ఎత్తేశాడు...

టీడీపీ ఉన్నప్పుడే ఏదైనా వ్యాపారం పెట్టుకునేకి సబ్సిడీతో లోన్లు ఇచ్చింది. ఆయప్ప(జగన) ఏందో పొడుస్తానని ఒక్క చాన్స... ఒక్క చాన్స అని వచ్చి లోన్లన్నీ ఎత్తిపారేశ. మూడేళ్లయింది ఒక్క లోన కూడా లేదంటూ’ నగరానికి చెందిన పలువురు నిరుద్యోగ యువత జగన ప్రభుత్వంపై మాట్లాడటం కనిపించింది. ఉమ్మడి అనంతపురం జిల్లా పర్యటనకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తపోవనంలోని వీవీఆర్‌ ఫంక్షనహాల్‌కు వచ్చారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన నగరానికి చెందిన కొందరు యువకులు టీస్టాల్‌ వద్ద వైసీపీ ప్రభుత్వంపై పిచ్చపాటిగా మాట్లాడుకున్నారు. వారు మాట్లాడుకుంటున్న సమయంలోనే టీ స్టాల్‌ నిర్వాహకుడు సైతం అవునన్నో... అదేమో నిజమే. ఏందో వైఎస్సార్‌ సొంతిళ్లని చెప్తే... నేను కూడా ఓటేశాను. మూడేళ్ల పొద్దయింది. సచివాలయానికి పోవడం, ఫొటోలు, పేపర్లు, ఆధార్‌కార్డులు ఇచ్చేకే సరిపోయింది. ఇంత వరకూ స్థలం ఇచ్చిందీ లేదూ, పోయింది లేదంటూ వారి మాటల కు మాట కలపడం కనిపించింది. ఆత్మకూరుకు చెందిన ఓ రైతు అక్కడికి చేరుకొని మాకి అట్లే అయ్యిందిలేప్పో... రైతు భరోసా తప్పా ఇంకేమీ ఆయప్ప సేయలేదు అని వారి మాటలకు శ్రుతి కలిపాడు. వర్షాలొచ్చి మొత్తం పంట నాశనమైపోయింది. పంట నష్టపరిహారం కోసం మా ఊర్లో అధికారులను అడిగితే.. ఫొటో తీసుకున్నారుగానీ.. ఇంత వరకూ ఒక్కరూపాయి కూడా రాలేదన్నారు.  ఇంకెన్నాళ్లులే రెండేళ్లుంటే కథ చెప్తామంటూ ఆరైతు వైసీపీ పాలనపై ముక్తాయింపునిచ్చారు. 

- అనంతపురం ప్రెస్‌క్లబ్‌


పథకాలివ్వడమెందుకు...

ధరలు పెంచేదెందుకు...? 

- వెంకటేశ్వర్లు, నారాయణపురం

జగన్మోహనరెడ్డి ప్రభుత్వానిది బాదుడే బాదుడు అని చంద్రబాబునాయుడు విమర్శించడంలో తప్పేమీ లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి ప్రతి ఒక్కటీ ధరలు పెంచుతూ వచ్చారు. అధికారంలోకి వచ్చేందుకు పథకాలను హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక పథకాల అమలుకు డబ్బు సమీకరించుకునేందుకు పరోక్షం గా నిత్యావసరాల ధరలను పెంచేసి ప్రజలపైనే భారం మోపారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ ప్రభుత్వంలో రోజురోజుకీ విపరీతంగా పెరుగుతున్న నిత్యావసరాల ధరలతోపాటు ఇంటిపన్ను, కరెంటుబిల్లు, పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరల మూలంగా సామాన్యుడు బతకలేని పరిస్థితి ఉంది. మూడుపూటల భోజనం తినేవాడు సైతం ఒక్కపూటకే పరిమితమయ్యే దుర్భర పరిస్థితులు దాపురించాయి. అసలు పథకాలు ఎవరు పెట్టమన్నారు..? ఆ పథకాల కోసం పరోక్షంగా ధరలెవరు పెంచమన్నారు..?

- అనంతపురం కల్చరల్‌


చంద్రబాబే మేలప్పో !

- టీ స్టాల్‌ వద్ద ఇద్దరు వ్యక్తుల మధ్య సాగిన సంభాషణ

 మాజీ సీఎం చంద్రబాబునాయుడు జిల్లా పర్యటన నేపథ్యంలో నగరంలోని బళ్లారిబైపాస్‌ సమీపంలోని ఓ టీస్టాల్‌ వద్ద ఇద్దరు వ్యక్తులు మధ్య మాటలు ఇలా సాగాయి.. సెంద్రబాబు వచ్చినాడంటన్నా! ఏం మాట్లాడ తాడో ఏమో! అందరూ పద్దట్నించి రోడ్లపైనే తిరుగుతాండా రు. ఏమైనా వైసీపీ అధికారంలోకి వచ్చినంక జగన శానా పథకాలు పెట్టాడు. కానీ పేదొళ్లకు శానా నష్టం తెస్తోంది. సరుకుల రేట్లు అబ్బుటికంటే ఇబ్బుడు రెండింతలయ్యాయి. జగన పథకాల వల్ల కొన్ని వర్గాలకే మేలు జరుగుతోంది. మా ఊర్లో రైతులైతే జగనపై విరుచుకుప డుతున్నారు. ఒక్క పథకం కూడా రైతులకు అందడం లేదని వాపోతున్నారు. ఏది ఏమైనా అంతో ఇంతో చంద్రబాబు హయాంలోనే మేలప్ప.. అని ఆ ఇద్దరి మధ్య సంభాషణ సాగింది. టీ స్టాల్‌లో టీ తాగే మిగిలిన వాళ్లు కూడా కాసేపు వారి సంభాషణను విని నిజమే కదా అని అనడం కనిపించింది. 

- అనంతపురం సిటీ


రాష్ట్రం ఐసీయూలో ఉంది

 ‘రాష్ట్రం పరిస్థితి ప్రస్తుతం ఐసీయూలో ఉన్నట్లు ఉంది. సాధారణ స్థితికి రావడం కష్టం’ అని ఓ ప్రభుత్వ పాఠశాలలో పని చేసే ఉపాధ్యాయుడు టీచర్‌ నాగభూషణ తమ మిత్రులతో  చర్చించడం కనిపించింది. శుక్రవారం జిల్లా కేంద్రంలోని  తపోవనం సర్కిల్‌ సమీపంలోని ఓ ఫంక్షనహాల్లో టీడీపీ అధినేత చంధ్రబాబునాయుడు పార్టీ కార్యకర్తలతో  సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో ఆ ప్రాంతమంతా జనంతో నిండిపోయింది. అందులో భాగంగా తపోవనం సర్కిల్లోని ఓ చెఫ్‌లో నాగభూషణం అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు తమ మిత్రులతో కలిసి టీ తాగుతూ చర్చ పెట్టారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఏమి పాలన జరుగుతోందో అర్థం కాని పరిస్థితి ఏర్పడిందన్నారు.  ఒక్క అవకాశం ఇద్దామని ఉద్యోగులు, అన్ని వర్గాల వారు ఆలోచించడంతోనే ప్రస్తుతం వైసీపీ అధికారంలోకి వచ్చిం ది. ఇక బుద్ధి ఉన్న ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగి ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీకి ఓటు వేసే పరిస్థితి లేదన్నారు. దీనికి అతడి మిత్రులు సైతం అంగీకరించారు.  


చిల్లరకు ఎవరూ ఆశపడటం లేదు

ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు ఇచ్చే చిల్లరకు రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం ఆశపడటం లేదని ఓంకార్‌రెడ్డి తమ మిత్రులతో చర్చ పెట్టారు. శుక్రవారం తపోవనం సర్కిల్‌లోని ఓ కేఫ్‌లో ఓంకార్‌రెడ్డితో పాటు ఆ యన మిత్రులు కురుబ కుమార్‌, రఘుప్రసాద్‌లతో కలిసి టీ తాగుతూ ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితులపై  చర్చలేపారు.  ఇలాంటి ప్రభుత్వాన్ని ఎన్నడు చూడలేదని, పేదలకు ఎక్కడ న్యాయం జరుగుతోందని ప్రశ్నించారు. ఎవరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి. చిల్లర చల్లి నోట్లు ఎరుకున్నట్లుగా పాలన ఉందన్నారు. మరో సారి ఇలాంటి ప్రభుత్వం వస్తే రాష్ట్ర ప్రజలు వారి నాశనాన్ని వారే కొరుకున్నట్లే అన్నారు.  మూడు సంవత్సరాల్లోనే పరిస్థితి ఇంత దారుణంగా ఉంది. మరో రెండు సంవత్సరాలు ఎలా భరించాలని రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

- అనంతపురం న్యూటౌన


వీక్లీ ఆఫ్‌ మూణ్ణాళ్ల ముచ్చటే..

వైసీపీ అధికారంలోకి వచ్చాక పోలీసులకు వీక్లీ ఆఫ్‌ అంటూ జగన ఆర్భాటంగా ప్రకటించాడు. అది మూడునాళ్ల ముచ్చటగానే సాగింది కొన్ని నెలలు మాత్రమే అమలు చేసి తర్వాత వీక్లీ ఆఫ్‌ లేదు. ఏమీ లేదు. వీఐపీ బందోబస్తు తదితర డ్యూటీలు వేస్తున్నారని పలువురు పోలీసులు చర్చించుకోవడం కనిపించింది. జిల్లా పర్యటనకు వచ్చిన మాజీ సీఎం చంద్రబాబుకు బందోబస్తులో ఉన్న పలువురు ఈ విధంగా మాట్లాడుకోవడం కనిపించింది. సీఎం జగన పాలతో పోలిస్తే.. చంద్రబాబు హయాంలో పని ఒత్తిడి అంతగా ఉండేది కాదని అన్నారు. ఈ ప్రభుత్వంలో పోలీసులు పని చేయాలంటే ఒత్తిడికి గురి కావాల్సి వస్తోందని మాట్లాడుకున్నారు. ఒత్తిడి భరించలేక చాలా మంది పోలీసులు ఉద్యోగాలు వదులుకోగా.. మరికొందరు లూప్‌ లైనలోకి వెళ్తున్నారని, ఇంకొందరు ఏకంగా ప్రాణాలే కోల్పోయారని ఆవేదనగా చర్చించుకున్నారు.       

   - అనంతపురం సిటీ

Updated Date - 2022-05-21T07:12:18+05:30 IST