రైతు పొలంబాట
ABN , First Publish Date - 2020-07-03T10:19:31+05:30 IST
రైతు పొలం బాట పట్టాడు. బ్యాంక్ల నుంచి ఇంకా అప్పు పుట్టలేదు. మరోపక్క కరోనా. అయి నా రైతు పొలాల్లోకి అడుగుపెట్టాడు. తొలకరి
నెమ్మదిగా పుంజుకుంటున్న ఖరీఫ్
స్థానిక కూలీల మీద ఆధారం
ఇతర జిల్లాల కూలీలకు కరోనా దెబ్బ
ఇప్పటికి 10,675 హెక్టార్లలో మొదలు
బోరు ఆధారిత భూమిలో వరి సాగు జోరు
డెల్టాలో నెమ్మది
ఆగస్టులో కూడా నాట్లు పడే అవకాశం
కౌలు రైతులకు అందని సాయం
(కాకినాడ-ఆంధ్రజ్యోతి): రైతు పొలం బాట పట్టాడు. బ్యాంక్ల నుంచి ఇంకా అప్పు పుట్టలేదు. మరోపక్క కరోనా. అయి నా రైతు పొలాల్లోకి అడుగుపెట్టాడు. తొలకరి రావడంతో జిల్లాలో పంట భూములన్నీ పులకరిస్తున్నాయి. చేలగట్లు వేయడం, నారుమళ్లు వేయ డం, దమ్ము చేయడం వంటి పనులు జోరుగా జరుగుతున్నాయి. బోరు ఆధారిత భూముల్లో నాట్లు ఊపందుకున్నాయి. చాలాచోట్ల నేరుగా విత్తనాలు వెదజల్లే పద్ధతి కూడా మొదలైంది. డెల్టాలో మాత్రం నెమ్మదిగా నారుమళ్లు పోస్తున్నారు. మొత్తం నాట్లు ఆగస్టు వరకూ కొనసాగే అవ కాశం ఉంది.
ఖరీఫ్ సీజన్ జూన్లో ముమ్మరం అయితేనే రబీ నంబర్లో మొదలయ్యే అవకాశం ఉంటుంది. పైగా ఖరీఫ్ వర్షాల బారి నుంచి కూడా బయటపడవచ్చు. కానీ సరైన ప్రణాళిక లేకపోవడం, వ్యవసాయాధికారులు, జలవనరుల శాఖ అధికారుల ప్రణాళికలు కాగితాలకే పరిమి తం కావడం వల్ల రైతుకు ఇబ్బందులు తప్పడం లేదు. రైతు రుణాలు అందలేదు. కౌలు రైతులకు ఇప్పటికీ పూర్తి పంటసాగు హక్కు పత్రాలు అందలేదు. కానీ కాలువలకు నీరు రావడం, వర్షాలు పడుతుండడంతో పొలాల్లో దుక్కులు మొదలయ్యాయి. 65 వేల ఎకరాలలో నేరుగా విత్తనాలు వెదజల్లే పద్ధతిలో సాగు చేయనున్నారు. కానీ ఆగస్టు వరకూ నాట్లు వేస్తూ ఉంటే నవంబరు వరకూ ఖరీఫ్ సీజన్ ఉంటుంది. తుపాన్ల దెబ్బ తగిలే ప్రమాదం ఉంది. రబీ ఆలస్యమతుంది. జిల్లాలో మొత్తం 256599 హెక్టార్లలో వివిధ రకాల పంటల సాగుకు ప్రణాళిక ఉంది.
223431 హెక్టార్లలో వరిసాగు, 1413 హెక్టార్లలో తృణధాన్యం, 5714 హెక్టార్లలో పప్పు ధాన్యాలు, 329 హెక్టార్లలో ఆయిల్ సీడ్స్, 25,712 హెక్టార్లలో ఇతర పంటలు సాగు చేయనున్నారు. వరి ఇప్పటి వరకూ 19,675 హెక్టార్లలో మాత్రమే మొదలైంది. అందులో నేరుగా విత్తనాల జల్లే విధానంలోనే ఎక్కువ ఉంది. 4068 హెక్టార్లలో నారుమళ్లు వేశారు. ఊడ్పులు కూడా పుంజుకుంటున్నాయి. జొన్న,బజరా, మొక్క, రాగి, సామ, కొర్రలు, కందిపప్పు పెసలు, మినుములు, ఉలవలు, శనగలు, వేరుశనగ, నువ్వులు, సోయాబీన్, మిర్చి, ప్రత్తి, పసుపు,చెరకు, ఉల్లిపాయ పంటలు జోరందుకోలేదు. కాగా జిల్లాలో వరినాట్లు వేయడానికి ఇతర జిల్లాల నుంచి ఎక్కువగా కూలీలు వస్తుంటారు. కరోనా వల్ల వలస కూలీలు రావడం మానేశారు. ఇటీవల రాజమహేంద్రవరం రూరల్ రాజవోలు గ్రామానికి చెందిన కొందరు రైతులు ఇతర జిల్లా ల నుంచి 35 మంది కూలీలను తీసుకుని వస్తే, స్థానిక సచివాలయ అధికారులు అభ్యంతరం చెప్పడంతో కరోనా భయం వల్ల కూలీలు వెనక్కి వెళ్లిపోయారు.
ప్రస్తుతం జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన కూలీలు మాత్రమే పనిచేస్తున్నారు. మరోవైపు జిల్లాలో పంట సాగు హక్కు పత్రాలు (సీసీఆర్ కార్డులు) 2 లక్షలుగా లక్ష్యం పెట్టుకున్నారు. ఇంతవరకూ 29,896 మందికి మాత్రమే ఈ కార్డులు ఇచ్చారు. వాస్తవానికి జిల్లాలో 90 శాతం మంది కౌలు రైతులే. వారందరికీ బ్యాంక్ రుణాలు దక్కడం లేదు. జూలై నెల వచ్చేసినా ఇప్పటికే 15 శాతం మందికి మాత్రమే సీసీఆర్ కార్డులు అందాయి. ఇంకా వారికి బ్యాంక్ నుంచి పూర్తిగా రుణాలు అందలేదు. మిగతా రైతులకు ఎప్పుడు ఈ కార్డులు ఇస్తారనే ప్రశ్నారఽ్థకం.
పెట్టుబడి తడిసిమోపెడు...
వ్యవసాయ పెట్టుబడి తడిసిమోపెడవుతోంది. విత్తనాల దశ నుంచి చేను చదును, నారుమడి, నాట్లు, ఎరువులు, పురుగుమందులు పిచికారీ చేయడంతో పాటు పంట చేతికొచ్చే వరకు అయ్యే పెట్టుబడి ఎకరాలకు రూ.25 వేల వరకు అవు తోంది. ఇక కూలి రేట్లు పెరిగిపోవడంతో వేలాది రూపాయలు అదనంగా ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో సాగు ఎనలేని భారమైంది.
- గోదావరి వీరబాబు, రైతు, రాజవోలు