KCR హామీలు అమలుకాకపోవడంతోనే పేదలు రోడ్డెక్కారు: విజయశాంతి
ABN , First Publish Date - 2022-05-19T03:19:28+05:30 IST
KCR హామీలు అమలుకాకపోవడంతోనే పేదలు రోడ్డెక్కారు: విజయశాంతి
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై బీజేపీ నాయకురాలు విజయశాంతి విమర్శలు గుప్పించారు. కేసీఆర్ హామీలు ఆకాశానికి నిచ్చెన వేసినట్టే ఉంటాయని, ఎన్నికల హామీలు నీటిమూటల్లాగే మిగిలిపోతున్నాయని గుర్తు చేశారు. అందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించి, గుడిసెలు లేని వరంగల్ చేస్తామన్న కేసీఆర్ హామీ అమలుకాకపోవడంతో పేదలు రోడ్డెక్కి ధర్నా చేస్తున్నారని విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాములమ్మ సోషల్ మీడియాలో పోస్టు యథాతథంగా..
''కేసీఆర్ ఇచ్చే హామీలు ఆకాశానికి నిచ్చెన వేసినట్టే ఉంటాయి. సీఎం సారు చెప్పే మాటలు బారెడు... చేసే పనులు మూరెడు. దొరగారు ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు నీటిమూటల్లాగే మిగిలిపోతున్నాయి. ఇప్పుడు ఓరుగల్లు బిడ్డలు రోడ్డెక్కి ధర్నా చేస్తున్నరు. అందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి, గుడిసెలు లేని వరంగల్ చేస్తమని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి ఏడేండ్లయితున్నా అమలుకాకపోవడంతో గ్రేటర్ వరంగల్లో పేదలు రోడ్డెక్కుతున్నరు. కిరాయి ఇండ్లకు నెలనెలా వేలల్లో ఇంటి కిరాయిలు కట్టే స్థోమత లేక... కేసీఆర్ సర్కారుతో తాడో పేడో తేల్చుకుందమని పోరుబాట పడుతున్నరు. ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకుంటున్నారు. వీటిని రెవెన్యూ, పోలీస్ అధికారులు జేసీబీలు పెట్టి కూల్చేస్తున్నరు. కొన్నిచోట్ల అగ్గిపెడుతుంటే పేదలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నరు. తమకు ఇల్లు కట్టిస్తమని చెప్పి కట్టియ్యకపోగా... తాము వేసుకుంటున్న గుడిసెలను తొలగించుడేందని ప్రశ్నిస్తున్నారు. బడాబాబులు వేల ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జా చేసినా పట్టించుకోని అధికారులు... గరీబోళ్ల మీద పగబట్టినట్లు చేసుడేందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నరు. రెండు వారాలుగా ఏదో ఒక రూపంలో నిరసనలు చేస్తున్నరు. వరంగల్ ఒక్క చోటే కాదు. తెలంగాణ మొత్తం ఇదే జరుగుతుంది. రాబోవు రోజుల్లో తెలంగాణ ప్రజానీకమే కేసీఆర్ సర్కార్ను బంగాళఖాతంలో కలపడం ఖాయం.'' అని విజయశాంతి అన్నారు.