చెరువును చెరబట్టారు

ABN , First Publish Date - 2022-08-11T06:21:55+05:30 IST

‘అధికారం’ అండగా చెరువును చెరబట్టారు. చౌడేపల్లె మండలంలోని అతి పెద్ద చెరువుల్లో ఒకటైన బుటకపల్లె చెరువును వైసీపీ నాయకులు యథేచ్ఛగా ఆక్రమిస్తున్నారు.

చెరువును చెరబట్టారు
ట్రాక్టర్‌తో దున్నిన బుటకపల్లె చెరువు

 వైసీపీ నాయకుల అధీనంలో 30 ఎకరాలు

 సాగులో టమోట, వరి 

 పట్టించుకోని రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు

చౌడేపల్లె, ఆగస్టు 10: ‘అధికారం’ అండగా చెరువును చెరబట్టారు. చౌడేపల్లె మండలంలోని అతి పెద్ద చెరువుల్లో ఒకటైన బుటకపల్లె చెరువును వైసీపీ నాయకులు యథేచ్ఛగా ఆక్రమిస్తున్నారు. దుర్గసముద్రం పంచాయతీలోని బుటకపల్లె చెరువులో ఐదు ఎకరాలను రెండు రోజుల్లో  ఆక్రమించేశారు. సర్వే నెం.246లో 96 ఎకరాల విస్తీర్ణంలో బుటకపల్లె చెరువు ఉంది. ఈ చెరువు కింద సూమారు 300 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ఆయకట్టులో పంటలు సాగవుతున్నాయి. ఎప్పుడూ నీరు పుష్కలంగా ఉండడంతో ఇక్కడ ఎకరా ధర సుమారు రూ.15లక్షల వరకు పలుకుతోంది. దీంతో కొందరు చెరువును ఆక్రమించేందుకు స్కెచ్‌ వేశారు. ఇలా 30 ఎకరాలకు పైగా కబ్జా చేసి వరి, టమోటా తదితర పంటలు సాగు చేస్తున్నారు. మరికొందరు చెరువులోనే బోర్లూ వేసి పంటల సాగు చేపట్టారు. మరి కొందరు వైసీపీ నాయకులు రెండు రోజులుగా ట్రాక్టర్‌తో దుక్కి చేస్తూ.. ఎక్స్‌కవేటరుతో చదును చేసుకుంటున్నా రెవెన్యూ, ఇరిగేషన్‌ శాఖ అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిస్తుంది.  కలెక్టర్‌ స్పందించి చెరువు ఆక్రమణలను తొలగించాలని ఆయకట్టుదారులు కోరుతున్నారు. 



Updated Date - 2022-08-11T06:21:55+05:30 IST