ట్రయల్ చూస్తానంటూ.. లారీతో మాయం
ABN , First Publish Date - 2020-06-07T10:45:00+05:30 IST
ట్రయల్ చూస్తానని లారీతో సహా ఉడాయించిన పాత నేరస్తుడిని అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దొంగను అరెస్ట్ చేసిన పోలీసులు
వనస్థలిపురం, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): ట్రయల్ చూస్తానని లారీతో సహా ఉడాయించిన పాత నేరస్తుడిని అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై ఏపీలో 12 కేసులు ఉన్నాయి. వనస్థలిపురం ఏసీపీ జయరాం, అబ్దుల్లాపూర్మెట్ ఇన్స్పెక్టర్ దేవేందర్లు శనివారం వివరాలు వెల్లడించారు. కృష్ణా జిల్లా, కొత్తపల్లికి చెందిన కోరం అనిల్ కుమార్(40) లారీ డ్రైవర్. ఈ నెల 4న అనిల్కుమార్ తాను లారీ డ్రైవర్ను అని, ఉల్లి లోడ్తో తన లారీ ఆగిపోయిందని, అన్లోడ్ చేయడానికి మరో లారీ అవసరమని పెద్దంబర్పేటకు చెందిన అన్నపూర్ణ లారీ సర్వీస్ కార్యాలయానికి ఫోన్ చేశాడు.
ట్రాన్స్పోర్టు యజమాని పండి వేణుగోపాల్ ఏపీ 05 వై 9569 నంబరు లారీని డ్రైవర్ వరప్రసాద్కు ఇచ్చి పంపించాడు. అక్కడికి వెళ్లిన తర్వాత నిందితుడు సుమారు గంటపాటు కాలయాపన చేశాడు. మధ్యాహ్నం కావడంతో డ్రైవర్ వరప్రసాద్ వెంట తెచ్చుకున్న భోజనం చేసేందుకు ఉపక్రమించాడు. ఈ క్రమంలో అనిల్కుమార్ లారీని ఒకసారి ట్రయల్ చూస్తానని నమ్మబలికి తీసుకెళ్లాడు. ఎంతరూ తిరిగిరాకపోవడంతో అనుమానం వచ్చిన వరప్రసాద్ తన యజమాని వేణుగోపాల్కు సమాచారం ఇచ్చాడు. అతని ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. 24 గంటల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.