పోలీసులకు ప్రజాసహకారం అవసరం
ABN , First Publish Date - 2021-10-22T06:44:17+05:30 IST
శాంతి భద్రతలే లక్ష్యంగా.. ఎవరికి ఏ సమస్య వచ్చినా ప్రాణాలొడ్డి విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ప్రజల సహకారం అవసరమని జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జి పార్థసారథి పేర్కొన్నారు.
జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జి పార్థసారథి
చిత్తూరు, అక్టోబరు 21: శాంతి భద్రతలే లక్ష్యంగా.. ఎవరికి ఏ సమస్య వచ్చినా ప్రాణాలొడ్డి విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ప్రజల సహకారం అవసరమని జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జి పార్థసారథి పేర్కొన్నారు. చిత్తూరులోని పోలీసు పరేడ్ మైదానంలో గురువారం జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో ఆయన మాట్లాడారు. విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమన్నారు. పోలీస్ వ్యవస్థలేని సమాజాన్ని ఊహించలేమన్నారు. 1959 అక్టోబరు 21న జరిగిన దురదృష్టకర ఘటనను గుర్తు చేసుకుంటూ వారి త్యాగాలకు గుర్తుగా ఏటా పోలీసు అమర వీరు సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకొంటున్నామని కలెక్టర్ హరినారాయణన్ తెలిపారు. కరోనా కష్టకాలంలో విధి నిర్వహణలో ఉంటు ఇద్దరు పోలీసులు మృతి చెందారని ఎస్పీ సెంథిల్కుమార్ గుర్తుచేసుకున్నారు. వారందరిని స్మరించుకోవడం మన ధర్మమన్నారు. అంతకుముందు పోలీసు అమరవీరుల స్థూపానికి అతిథులు నివాళులర్పించారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. పోలీసు అమరవీరుల కుటుంబీకులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, ఎస్ఈబీ జేడీ విద్యాసాగర్ నాయుడు, ఏఎస్పీ మహేష్, చిత్తూరు డీఎస్పీ సుధాకర్రెడ్డి, ఎస్బీ డీఎస్పీ శ్రీనివాసులురెడ్డి, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.