అధికారపార్టీ తొత్తులుగా వ్యవహరిస్తున్న పోలీసులు
ABN , First Publish Date - 2021-09-14T17:56:59+05:30 IST
అధికారపార్టీ నాయకులకు..
టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ నరేంద్రవర్మ
బాపట్ల: అధికారపార్టీ నాయకులకు పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వేగేశన నరేంద్రవర్మ ఆరోపించారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రెండు రోజులక్రితం చందోలు పోలీసు స్టేషన్ పరిధిలో రెడ్డిపాలెంలోని సొంత స్థలంలో మద్యం తాగుతుంటే తెలుగుదేశం పార్టీకి చెందిన వారిని కొంతమంది వైసీపీ నాయకుల మాటలకు పోలీసులు వత్తాసుపలికి వారిపై అక్రమంగా డ్రంకెన్ డ్రైవ్ కేసులు పెట్టటం దారుణమన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపేవారిపై డ్రంకెన్ డ్రైవ్ కేసులు పెట్టాలి కాని సొంత స్థలంలో కూర్చొని తాగేవారిపై ఈ కేసులు పెట్టటం విడ్డూరంగా ఉందన్నారు. పైగా వారిని పోలీసుస్టేషన్కు తరలించటాన్ని ఖండిస్తున్నట్లు నరేంద్రవర్మ తెలిపారు. వైసీపీ నాయకులు చట్టాన్ని చుట్టంలా వాడుకుంటున్నారని ఇకనైనా పోలీసులు టీడీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టటం మానేసి చట్టపరంగా నడుచుకోవాలని ఆయన హితవు పలికారు. లేకపోతే రాబోయే రోజులలో అక్రమ కేసులు విషయంలోకాని హక్కులను కాపాడుకునే విషయంలో కాని న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని నరేంద్రవర్మ తెలిపారు.