చెప్పింది రూ. 600.. వచ్చింది రూ.540!!
ABN , First Publish Date - 2020-07-03T11:32:36+05:30 IST
ఓ కారు యజమాని రూ. 600 పెట్రోల్ పోయమని బంకు ఉద్యోగికి డబ్బులు ఇచ్చాడు.
పెట్రోల్ బంకు మాయాజాలం
కౌడిపల్లి, జూలై 2: ఓ కారు యజమాని రూ. 600 పెట్రోల్ పోయమని బంకు ఉద్యోగికి డబ్బులు ఇచ్చాడు. కానీ బంకువారు రూ. 540ల పెట్రోల్ మాత్రమే వేశారు. మండల పరిధిలోని తునికి ఎస్సార్ పెట్రోల్బంకులో ఈ సంఘటన జరిగింది. రాయిలపూర్ గ్రామానికి మహేందర్రెడ్డి గురువారం తన కారులో పెట్రోల్ వేసుకోవడానికి బంకుకు వెళ్లాడు. రూ. 600 ఇవ్వగా.. మీటర్లో రూ. 60 పూర్తయిన తరవాతనే పెట్రోల్ రావడం మొదలైంది.
దీంతో అనుమానంతో తరువాత వచ్చిన బైకులో పెట్రోల్ వేయడాన్ని పరిశీలించగా రూ. 60 చెల్లిస్తే రూ. 20 విలువైన పెట్రోల్ తక్కువగా వచ్చింది. దీనిపై బంకు సిబ్బందిని నిలదీయగా పొంతనలేని సమాధానం చెప్పారు. బంకు యాజమాన్యం చేతివాటం ప్రదర్శిస్తుండడంతో తక్కువ పెట్రోల్ వస్తోందని, ఇలా ప్రతీరోజు వందల మంది వాహనదారులను దోచుకుంటున్నారని బాధితులు ఆరోపించారు. అధికారులు స్పందించాలని కోరారు.