పరిపూర్ణ యోగి!

ABN , First Publish Date - 2020-12-04T05:41:18+05:30 IST

మనకు ఎంతోమంది దేవుళ్ళూ, దేవతలూ ఉన్నారు. వారెవరినీ మనం చూడలేదు. కేవలం ఉన్నారన్న నమ్మకంతో పూజిస్తాం, ఆరాధిస్తాం.

పరిపూర్ణ యోగి!

మానవుడు దివ్యమానవునిగా రూపాంతరం చెందే క్రమానికి భారతదేశం ఆధ్యాత్మిక నాయకత్వం వహిస్తుందని ప్రకటించిన దార్శనికుల్లో మొదటివాడు అరవిందుడు. ఆయన తత్త్వవేత్త మాత్రమే కాకుండా విప్లవకారుడు, గ్రంథకర్త, జాతీయోద్యమ నాయకుడు కూడా!.


రేపు శ్రీ అరవిందుల వర్థంతి

మనకు ఎంతోమంది దేవుళ్ళూ, దేవతలూ ఉన్నారు. వారెవరినీ మనం చూడలేదు. కేవలం ఉన్నారన్న నమ్మకంతో పూజిస్తాం, ఆరాధిస్తాం. కానీ సూర్యభగవానుడి విషయంలో అలా కాదు. ఆయనను మనం నిత్యం చూస్తూనే ఉంటాం. రెండు మూడు రోజులు మబ్బులు కమ్మి ఆయన కనిపించకపోతే తల్లడిల్లిపోతాం. సూర్యుడితో పోల్చదగినది మరేదీ లేదు. అలాగే ఆధ్యాత్మికవేత్తలలో శ్రీఅరవిందులతో మరొకరికి పోలిక లేదు. ఆయన యోగ సాధన లక్ష్యం కేవలం తాను అజ్ఞానం నుంచి బయటపడి, మోక్షం సంపాదించుకోవడం కాదు... యావత్‌ మానవ జాతినీ అజ్ఞానాంధకారం నుంచి తప్పించడానికి ఆయన చేసిన మహా తపస్సు.


 ‘పూర్ణ స్వరాజ్యం’ అనే భావనకు ఆద్యుడు ఆయనే. ‘‘మానవ పురోగమనంలో రాబోయే మహత్తర దశల్లో భౌతికంగానే కాదు, మానసికంగా, ఆధ్యాత్మికంగా కూడా ముందుకు సాగాలి. దీనికి భారతదేశం నాయకత్వం వహించాలి. కాబట్టి ప్రపంచ శ్రేయస్సు కోసం భారతావని విముక్తి కావాలి’’ అని అరవింద్‌ ఘోష్‌ స్పష్టం చేశారు. అప్పటి బ్రిటిష్‌ ప్రభుత్వం ఆయనను ఆలీపూర్‌ బాంబు కేసులో అరెస్ట్‌ చేసింది.  ఆయన జీవితం అప్పుడే ఒక గొప్ప మలుపు తిరిగింది. కారాగారంలో యోగాభ్యాసాన్ని కొనసాగించారు. అక్కడ తనకు శ్రీకృష్ణ దర్శనం కలిగిందనీ, భారతదేశానికి స్వాతంత్య్రం రావడం తధ్యమనీ, దానికి వేరే నాయకులు రాబోతున్నారనీ, ‘నీవు సాధించాల్సింది వేరే ఉంద’నీ శ్రీకృష్ణ భగవానుడి దివ్య సందేశం తనకు అందిందని ఆయన ప్రకటించారు. అలా మహా విప్లవకారుడిగా కారాగారంలోకి వెళ్ళిన అరవింద్‌ ఘోష్‌ ఒక మహాయోగిగా... శ్రీఅరవిందునిగా బయటకు వచ్చారు. పాండిచ్చేరి చేరుకొని, యోగసాధనలో మునిగిపోయారు. 


మానసిక జీవి అయిన మానవుడు ప్రకృతి బంధనాల నుంచి బయటపడి మోక్షం సంపాదించుకోవాలని మన యోగ శాస్త్రాలు చెబుతున్నాయి. పరమేశ్వరుడితో జీవుడు అనుసంధానమై, తద్వారా పరమాత్మలో లీనం కావాలని మన మహర్షులు బోధించారు. అయితే అంతటితో శ్రీ అరవిందులు సంతుష్టి చెందలేదు. ఈనాటి మానవుడు పరిణామక్రమంలో దివ్యమానవుడిగా మారాల్సి ఉందనీ, ఈ నేల మీదే దివ్యజీవితం గడపాల్సి ఉందనీ స్పష్టం చేశారు. అదే పరమాత్మ సంకల్పమని ఆయన ప్రకటించారు.  ‘‘శ్రీ అరవిందుల సందేశాలను అనుసరించడం ఈ నాటి ప్రపంచానికి తప్పనిసరి. ఈ భూమిమీద దివ్య జీవనం ఉనికిలోకి వచ్చేంత వరకూ ఆయనను అనుసరించడం మినహా గత్యంతరం లేదు’’ అంటారు ‘శ్రీమాత’గా అరవిందుని అనుయాయులు పిలుచుకొనే ఆయన శిష్యురాలు మీరా ఆల్ఫాసా. 


ఈ ప్రపంచమనేది ఏదో యాదృచ్ఛిక ఘటన కాదనీ,  దీన్ని చెక్కిన శిల్పి అంధుడైన ఒక దేవుడు కాదనీ తన ‘సావిత్రి’ గ్రంథంలో శ్రీ అరవిందులు స్పష్టం చేశారు. ఈ సృష్టికి ఒక సచేతన శక్తి ప్రణాళికను రచించిందనీ, ఎంతో ఉన్నతమైన ఈ ఈ జగత్‌ శిల్పంలో ప్రతి అణువుకూ గొప్ప అర్థం, పరమార్థం ఉన్నాయనీ ఆయన పేర్కొన్నారు.  పరమాత్మ ఆదేశానుసారం అనేకమంది అజ్ఞాత శిల్పులు ఈ జగత్‌ శిల్ప రచనలో పాలు పంచుకున్నారని వివరించారు. 


అరవిందుల ఆధ్యాత్మిక ప్రతిపాదనలు ఎంతో లోతైనవి. ఈ సృష్టి పరిణామానికి కారణం చేతనాపరమైనదే తప్ప భౌతికమైనది కాదనీ, ఈ పరిణామం మరింత ముందుకు కొనసాగుతుందనీ, ఈ క్రమంలో మానవుడు దివ్య మానవుడుగా మారుతాడనీ ఆయన చెప్పారు. ఏకకణ జీవి నుంచి ప్రారంభమై, అనేక మార్పులకు లోనైన జీవ పరిణామంలో మానవుడే చివరివాడనీ, కానీ ఈ పరిణామం ఇంకా ఆగిపోలేదనీ, ఇది కొనసాగుతుందనీ పేర్కొన్నారు. ఇలా కొనసాగే ఈ పరిణామంలో దివ్య మానవుడిగా మానవుడు రూపాంతరం చెందుతాడన్నారు. అలా రూపాంతరం చెందినప్పుడే దైవ సంకల్పం... తద్వారా మానవుడి పరమార్థం నెరవేరుతాయని వివరించారు. అలా మానవుడు... దివ్య మానవునిగా మారే అత్యున్నత సమాజాన్ని ఆయన కాంక్షించారు.


అలాంటి సమాజం రూపు దిద్దుకోవడానికి శ్రీ అరవిందాశ్రమం స్థాపన ద్వారా బీజాలు వేశారు. దానికోసం ఒక వినూత్నమైన యోగ ప్రక్రియను శ్రీ అరవిందులు రూపొందించారు. దాని పేరు ‘పూర్ణ యోగం’. ఈ యోగంలో ‘జీవితమంతా యోగమే’! జీవితం నుంచి బయటపడడం కాదు... దాన్ని దివ్య జీవితంగా మలచడమే దాని లక్ష్యం. ఈ మహా ప్రయత్నంలో భాగంగా, ఒక నూతన శక్తిని భూమిపై అవతరింపజేయడానికి వ్యూహాత్మకంగా (1950 డిసెంబరు అయిదున) శ్రీ అరవిందులు భౌతిక దేహాన్ని విడిచిపెట్టారని ఆయన అనుయాయుల విశ్వాసం. 

 కొంగర భాస్కరరావు

Updated Date - 2020-12-04T05:41:18+05:30 IST